మల్యాల/జగిత్యాల/కరీంనగర్/కరీంనగర్అర్బన్:
ఆర్టీసీ బస్సు, ఓ లారీ ఎదురెదురుగా ఢీకొనగా.. బస్సులో ఉన్న నలుగురు ప్రయాణికులు తీవ్రంగా.. మరో 19 మంది స్వల్ప గాయాల బారిన పడ్డారు. ఈ సంఘటన జగిత్యాల జిల్లాలోని మల్యాల మండలం కొండగట్టు సమీపంలోని మూలమలుపు వద్ద సోమవారం చోటుచేసుకుంది. కరీంనగర్–1 డిపోకు చెందిన బస్సు కరీంనగర్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తోంది. జగిత్యాల నుంచి కరీంనగర్ వైపు వస్తున్న లారీ దిగువ కొండగట్టు సమీపంలోని మూలమలుపు వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ మురళి, గుడివాడకు చెందిన లారీ డ్రైవర్ జాజి బాబు, అలాగే బస్సులో ప్రయాణిస్తున్న నిర్మల్ జిల్లా కడెంకు చెందిన ఎండీ.మునార్, సుప్రియ తీవ్రంగా గాయపడ్డారు. మరో 19మంది ప్రయాణికుల ముఖాలు, చేతులు, కాళ్లు, తలకు స్వల్ప గాయాలయ్యాయి. కొందరు ప్రయాణికులు బస్సు అత్యవసర ద్వారం, కిటికీల గుండా స్థానికుల సాయంతో కిందికి దిగారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్లో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలం వద్ద వాహనాలు భారీగా నిలిచిపోయాయి. మల్యాల ఎస్సై సందీప్ సంఘటనా స్థలానికి చేరుకుని వాహనాలను కొండగట్టు ఘాట్ రోడ్డు మీదుగా దారి మళ్లించారు.
బాధితులకు అండగా ఉంటాం
: మంత్రులు పొన్నం, అడ్లూరి
బస్సు ప్రమాద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న మంత్రి అడ్లూరి వెంటనే కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్కుమార్తో ఫోన్లో మాట్లాడారు. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కేంద్రమంత్రి బండి సంజయ్ దిగ్భ్రాంతి
ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్న ఘటనపై కేంద్రహోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జగిత్యాల కలెక్టర్, ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు. క్షతగాత్రులను మెరుగైన వైద్య సదుపాయాలున్న ఆసుపత్రులకు తరలించాలని సూచించారు.
అధికారులను అప్రమత్తం చేసిన కరీంనగర్ కలెక్టర్
ఆర్టీసీ బస్సు, లారీ ప్రమాద ఘటనపై కరీంనగర్ కలెక్టర్ చిత్రమిశ్రా వెంటనే స్పందించారు. క్షతగాత్రులకు ఇబ్బంది కలగకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. కరీంనగర్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్తో ఫోన్లో మాట్లాడారు.
మెరుగైన చికిత్స అందించాలి
గాయపడిన వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ వైద్యాధికారులకు సూచించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సోమవారం రాత్రి పరామర్శించారు. దూర ప్రాంతాలవారు కావడంతో బాధితులు, వారి కుటుంబ సభ్యులకు భోజన సౌకర్యం కల్పించాలన్నారు. అందరి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు.
నలుగురికి తీవ్ర గాయాలు
19మందికి స్వల్పగాయాలు
నుజ్జునుజ్జయిన బస్సు, లారీ ముందుభాగం
కొండగట్టు మూలమలుపు వద్ద ఘటన
క్షతగాత్రులు వీరే..
తుమ్మనపల్లి జ్యోష్నవి, సుప్రియ, కటుకం సుప్రజ, అఫియాజీన్ (కోరుట్ల), కోడూరి సుజాత(రామన్నపేట), గంధం గీతాంజలి, మోటం శంకర్, మోటం గంగు (కన్నాపూర్), అకూరి వైష్ణవి, వై.స్వప్న, దాసరి వినీల (మెట్పల్లి), జేరిపోతుల రాజమణి, జయసుధ (కామారెడ్డి), వెలిగొండ శ్రీనివాస్ (జగిత్యాల), ఏలేటి హర్షిత (రేకులపల్లి), ఎద్దం రమ్య(రామోజీపేట), వంగల సతీశ్ రెడ్డి(బోధన్)తోపాటు మరో ఇద్దరు పిల్లలు గాయపడిన వారిలో ఉన్నారు. గాయపడిన వారిలో కొందరు ఉద్యోగులు విధులకు వెళ్లి వస్తుండగా.. మరికొందరు పిల్లలను హాస్టల్లో దింపి వస్తున్నారు. వీరిలో కొంతమందిని జగిత్యాల ఆస్పత్రికి తరలించగా.. డీఎంహెచ్వో సుజాత ఆస్పత్రి సిబ్బందిని అప్రమత్తం చేశారు. అంబులెన్స్లో వచ్చిన క్షతగాత్రులకు వెంటవెంటనే చికిత్స అందించడంతోపాటు స్కానింగ్ చేపట్టారు. కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశాల మేరకు బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు అదనపు కలెక్టర్ రాజాగౌడ్ తెలిపారు. ఆస్పత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు.


