జగిత్యాలక్రైం: నాగుల పంచమి వేళ.. భక్తుల కళ్ల ముందే పామును హింసిస్తూ ఓ వేటగాడు డబ్బుల వసూళ్లకు పాల్పడ్డాడు. ఇంత జరుగుతున్నా అటవీశాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జగిత్యాల పట్టణంలోని గొల్లపల్లి రోడ్లోని మోతె శివారులోని పాముల పుట్ట వద్ద పుట్టలో పాలు పోసేందుకు పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చారు. ఇదే ఆసరాగా చేసుకున్న పాముల వేటగాడు ఓ నాగుపామును బంధించి దానిని హింసిస్తూ భక్తుల నుంచి డబ్బు వసూళ్లకు పాల్పడ్డాడు. డబ్బులు ఇవ్వని భక్తులపై నాగుపామును ఉసిగొల్పడంతో కొంతమంది భక్తులు భయభ్రాంతులతో పరుగులు పెట్టారు. నాగుపామును వేటగాడు గంటలతరబడి హింసించినా అటవీశాఖ అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరించారని, పాముతో వసూళ్లకు పాల్పడుతున్న వేటగానిపై అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.


