కరీంనగర్ కల్చరల్: మత్తు మహమ్మారిపై యువ కలం గళమెత్తుతోంది. గంజాయి, డ్రగ్స్కు వ్యతిరేకంగా అక్షరాలే ఆయుధాలయ్యాయి. మాదకద్రవ్యాల మాయలో చిక్కుకుని భవిష్యత్ను నాశనం చేసుకుంటున్న యువతను మేల్కొలిపేందుకు పలువురు యువ కవులు తమ కవిత్వంతో గళమెత్తారు. ‘మత్తుకు దూరంగా ఉండాలి.. మాదకద్రవ్యాల రహిత సమాజం కోసం మనమంతా ఒక్కటవ్వాలి’ అంటూ సందేశమిచ్చారు. ‘యుద్ధం మొదలైంది’ అంటూ కవితల రూపంలో తిరుగుబాటును ప్రకటించారు. ఆదివారం తెలంగాణ రచయితల సంఘం కరీంనగర్ ఆధ్వర్యంలో నిర్వహించిన యువ కవి సమ్మేళనంలో పలువురు యువ కవులు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలను కవితల రూపంలో వినిపించారు. మత్తు పదార్థాలు వ్యక్తినే కాదు.. కుటుంబాన్ని, సమాజాన్ని ఛిద్రం చేస్తాయని హెచ్చరిస్తూ, వాటి నిర్మూలన కోసం సమాజంతో కలిసి తామూ ముందుండి పోరాడతామని తమ కవితల రూపంలో చాటిచెప్పారు.
యువత మేలుకో. లే లేచి నిలబడు. నీ శక్తిని వృథా చేసుకోకు
మత్తుపై యుద్ధం చేయి. మత్తు కాదు. ఇది మరణపు విత్తనం
గంజాయి కాదు.. ఇది భవిష్యత్తు శవపేటిక
నీ రక్తంలో ఉరకలెత్తే స్వప్నాలు సాకారం కావాల్చి
కానీ.. మత్తు విషపు కోరల్లో బందీ అవకు.. ప్రతి పాఠశాలలో చైతన్య దీపం వెలిగిద్దాం
ప్రతి యువకుడి హృదయంలో ధైర్యాన్ని నాటుదాం
– మహాంకాళి సుగుణ, బెజ్జంకి, యువ రచయిత్రి
కళ్లు తెరువు యువకా..
నీ కలలను మింగేస్తున్న మత్తును వదిలేయ్!
నీ చేతిలో పుస్తకం ఉండాలి.. సిరంజి కాదు..
మైదానంలో ఆడాలి.. చీకటి అడ్డాల్లో కాదు..
అమ్మ కన్నీటిని చూడు.. నాన్న ఆశలను గుర్తుచేసుకో..
రేపటి భారతాన్ని నిర్మించే చేతులు
ఈ రోజు చెడిపోకూడదు..లేచి నిలబడు యువభారతమా.
– మాసం సీమ, కరీంనగర్
గంజాయి, డ్రగ్స్కు వ్యతిరేకంగా కవితలతో చైతన్య సందేశం


