పీడీయాక్ట్ తెరుస్తాం
జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లి శివారులో ఈనెల 3న నిజామాబాద్కు చెందిన మహిళపై సామూహిక లైంగికదాడికి పాల్పడిన ఘటనలో రౌడీషీటర్లు ఉన్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన నిందితుల్లో ఇద్దరు రౌడీషీటర్లు ఉండగా.. వీరికి మరో ఇద్దరు సహకరించారు. రౌడీషీటర్లలో ఒకరు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే అనుచరుడిగా చెప్పుకుంటూ పలు భూ సెటిల్మెంట్లు, పలు పంచాయితీలు చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు స్థానికులు వెల్లడించారు. ఏ–1 నిందితుడు, రాజారం గ్రామానికి చెందిన శివరాత్రి నరేశ్పై మల్యాల పోలీస్స్టేషన్లో 13 కేసులు, మరోచోట మరో కేసు నమోదైంది. రాజారం గ్రామానికి చెందిన గుర్రం శ్రీకాంత్పై ఇప్పటికే 9 కేసులున్నాయి. అలాగే గుర్రం అంజయ్యపై ఇప్పటికే ఒక కేసు నమోదైంది. ఇది రెండో కేసు. అలాగే ఏ–3, ధరూర్ గ్రామానికి చెందిన మర్రవేని మల్లేశ్పై గతంలో రెండు కేసులు నమోదు కాగా, మరో కేసు నమోదైంది. మహిళను రౌడీషీటర్ నరేశ్ పథకం ప్రకారమే రప్పించి శ్రీకాంత్కు సమాచారం అందించి.. లైంగికదాడికి పాల్పడి.. వీడియో చిత్రీకరణ చేసినట్లు గుర్తించారు.
రౌడీషీటర్ల హంగామా..
కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ఇద్దరు రౌడీషీటర్లలో ఒకరు ఎమ్మెల్యే అనుచరుడిగా మండలంలో చలామణి అవుతున్నాడు. పలువురు యువకులను వెంటేసుకుని నిత్యం రాజారం, టీఆర్నగర్, నూకపల్లి, మల్యాల, ముత్యంపేట, కొండగట్టు తదితర ప్రాంతాల్లో భూ సెటిల్మెంట్లు, పంచాయితీలు చేసి సొమ్ము చేసుకుంటున్నాడు. ఏదైనా గొడవలు జరిగితే తన వద్దనున్న గ్యాంగ్ను తెప్పించి దాడులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొద్దికాలంగా కొండగట్టు పుణ్యక్షేత్రానికి వచ్చే ప్రేమికులు, స్నేహితులు, కొంతమంది మహిళలను వీడియోలు చిత్రీకరించి భయబ్రాంతులకు గురిచేసి నగదుతోపాటు, బంగారు ఆభరణాలు కూడా బలవంతంగా లాక్కున్నాడనే ఆరోపణలు వెలువడుతున్నాయి. వీరి అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని చూసినా.. అధికార పార్టీ ఎమ్మెల్యే అండ ఉండటంతో పోలీసులు చూసీచూడనట్లుగా వ్యవహరించినట్లు మండలంలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేసులో ఉన్న ఇద్దరు రౌడీషీటర్లపై పీడీ యాక్ట్ ఓపెన్ చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.
పథకం ప్రకారమే వీడియో చిత్రీకరణ
నిందితుల్లో ఒకరు అధికారి పార్టీ ఎమ్మెల్యే అనుచరుడు
మహిళపై అత్యాచార కేసులో ఉన్న రౌడీషీటర్లపై పూర్తిస్థాయిలో దర్యాఫ్తు చేపట్టి పీడీయాక్ట్ ఓపెన్ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా.. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా పోలీసు శాఖ కఠిన చర్యలు చేపడుతుంది. నేర చరిత్ర ఉన్న వారిపై కూడా పోలీసు శాఖ వారి కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా పెడుతోంది.
– అశోక్కుమార్, జగిత్యాల ఎస్పీ


