ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఆర్టీసీ డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రం నుంచి సిరిసిల్ల జిల్లా కేంద్రానికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లికి చేరుకోగానే డ్రైవర్ చక్రపాణికి ఫిట్స్ వచ్చాయి. ప్రమాదాన్ని ముందుగానే గుర్తించిన డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి బస్సును రోడ్డు పక్కన నిలిపారు. బస్సులో ఉన్న ప్రయాణికులను కిందకి దింపిన తర్వాత అతను అక్కడే నేలపైన కొంత సేపు సేదతీరారు. గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకొని ఎల్లారెడ్డిపేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం సిరిసిల్ల ఆస్పత్రికి తీసుకెళ్లారు. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతోనే పెద్ద ప్రమాదం తప్పిందని ప్రయాణికులు తెలిపారు.
డ్రైవర్కు ఫిట్స్
బస్సును రోడ్డు పక్కన నిలిపిన డ్రైవర్
ప్రయాణికులు సురక్షితం


