కరీంనగర్: ప్రైవేటులో రూ.లక్షలు ఖర్చయ్యే టోట ల్ నీ రీప్లేస్మెంట్ (టీకేఆర్) శస్త్రచికిత్సను కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి (జీజీహెచ్)లో ఉచితంగా నిర్వహించారు. వయసు కారణంగా రిస్క్ ఉన్నప్పటికీ సవాల్గా తీసుకుని శస్త్రచికిత్సను పూర్తి చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సూపరింటెండెంట్ డాక్టర్ వీరారెడ్డి శనివారం వెల్లడించారు. కరీంనగర్లోని మంకమ్మతోటకు చెందిన జయలక్ష్మి (65) కొన్నేళ్లుగా మోకాళ్ల నొప్పులతో బాధపడుతోంది. నొప్పి తీవ్రం కావడంతో ఇటీవల కరీంనగర్ ప్రభుత్వ ప్రధానాసుపత్రికి వచ్చింది. పరీక్షించిన వైద్యులు మోకాలి కీలు పూర్తిగా అరిగిపోయినట్లు గుర్తించి, కీలు మార్పిడి శస్త్రచికిత్స అవసరమని సూచించారు. జయలక్ష్మి వయసు దృష్ట్యా శస్త్రచికిత్స రిస్క్ ఉన్నప్పటికీ వైద్యులు సవాలుగా తీసుకున్నారు. ఈ నెల 5న టీకేఆర్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. అరిగిపోయిన ప్రస్తుతం వృద్ధురాలి ఆరోగ్యం నిలకడగా ఉందని, వాకర్సాయంతో మూడు రోజుల్లోనే నడుస్తుందన్నారు.
జీజీహెచ్లో తొలిసారి
2023లో మెడికల్ కళాశాలకు అనుబంధ ఆస్పత్రిగా మారిన తర్వాత కరీంనగర్ ప్రభుత్వ ప్రధానాసుపత్రిలో తొలిసారిగా టీకేఆర్ శస్త్రచికిత్స నిర్వహించారు. ఆర్థోపెడిక్ సర్జన్లు వంశీ, ఆదిత్య, అనిస్థీషియా డాక్టర్ శంతన్కుమార్, సతీష్కుమార్, మమతతో పాటు వైద్య సిబ్బంది శస్త్రచికిత్సలో పాల్గొన్నారు. డబ్బు లేక వైద్యం ఆగిపోకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా వైద్య బృందం నిరంతర కృషిచేస్తోందని వీరారెడ్డి పేర్కొన్నారు.


