గంగాధర: మండలంలోని నారాయణపూర్ గ్రామంలో బుధవారం జరిగిన గ్రామసభ వివాదం, ఎస్సీ,ఎస్టీ కేసుపై కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్కుమార్ గురువారం విచారణ చేపట్టారు. గ్రామసభలో తనతో పాటు తన భర్త మధును కొందరు కులం పేరుతో దూషించి బెదిరించారని, మనస్తాపానికి గురైన తన భర్త మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడంటూ సర్పంచ్ దీకొండ బాబాలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్సై వంశీకృష్ణ 13మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఏసీపీ విజయ్కుమార్, సీఐ ప్రదీప్కుమార్ వివరాలు సేకరించారు. సర్పంచ్ భర్తే తమను తిట్టారని, కావాలనే నాటకమాడి తమపై తప్పుడు కేసులు పెట్టించారని బాధితులు పోలీసులతో ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం రాత్రి నుంచి కేసులో నిందితులుగా ఉన్న కొందరు కనిపించడం లేదని, వారి ఫోన్లు స్విచ్చాఫ్ వస్తున్నాయని వారి కుటుంబ సభ్యులు పోలీసులకు వివరించారు.


