మెట్పల్లిరూరల్: భూ రికార్డుల్లో పేరు సవరించేందుకు లంచం డిమాండ్ చేసి.. రూ.ఐదు వేలు తీసుకుంటుండగా మెట్పల్లి మండలం ఆత్మకూర్ జీపీవోను ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ కరీంనగర్ డీఎస్పీ మహేందర్రెడ్డి, బాధితుడి కథనం ప్రకారం.. ఆత్మకూర్కు చెందిన బుజ్జకర్ల మల్లేశ్ తన తండ్రి నడ్పిమల్లయ్యకు చెందిన రెండెకరాల వ్యవసాయ భూమిని కొన్నినెలల క్రితం సెల్డీడ్ చేయించుకున్నాడు. పట్టాపాస్బుక్లో మల్లేశ్ తండ్రి పేరు తప్పుగా నమోదైంది. విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పేరు సవరణకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియను పూర్తిచేసిన మల్లేశ్.. గ్రామ పాలన అధికారి రాజేశ్ను సంపద్రించి త్వరగా పని పూర్తి చేయాలని కోరాడు. దీనికి ఆయన రూ.5వేలు లంచం డిమాండ్ చేశాడు. అయినప్పటికీ తీవ్ర జాప్యం చేస్తుండడంతో విసుగు చెందిన బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. డీఎస్పీ మహేందర్రెడ్డి బృందం పథకం ప్రకారం గురువారం ఆత్మకూర్ చేరుకుంది. గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్లిన మల్లేశ్ జీపీవో రాజేశ్ను కలిసి పేరు సవరణ విషయంపై చర్చించాడు. త్వరగా పని పూర్తి చేయాలని రూ.5వేలు ఇచ్చాడు. అప్పటికే అక్కడ కాపుకాసి ఉన్న ఏసీబీ అధికారులు రాజేశ్ను పట్టుకున్నారు. రాజేశ్ను మెట్పల్లి తహసీల్దార్ కార్యాలయానికి తరలించి విచారణ చేపట్టారు. రికార్డులు పరిశీలించి కరీంనగర్ కోర్టులో హాజరుపరిచారు.
భూ రికార్డుల్లో పేరు సవరణకు డబ్బులు డిమాండ్
ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు
రూ.5వేలు తీసుకుంటుండగా పట్టివేత


