కరీంనగర్ కల్చరల్: డప్పు చప్పుళ్లు.. ఒగ్గుడోలు విన్యాసాలు.. కళాకారుల నృత్యాలు.. జై పోచమ్మ తల్లి నినాదాల మధ్య కరీంనగర్లో కళాకారులు బోనాల వేడుకను బుధవారం వైభవంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా కళాకారుల ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల జాతరలో మేయర్ కొలగాని శ్రీనివాస్ పాల్గొని బోనం ఎత్తారు. గీతాభవన్ చౌరస్తా నుంచి ప్రారంభమైన ఊరేగింపు బస్టాండ్, వన్టౌన్, కమాన్ మీదుగా కోతిరాంపూర్ శ్రీ పోచమ్మ ఆలయానికి చేరుకుంది. మహిళా కళాకారులు అమ్మవారికి నైవేద్యం సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. సంద స్వప్న, ప్రతిపల్లవి, రేణుక, గోగుల ప్రసాద్, బాబు గౌరవేణి, సంతోష్ తమ్మిశెట్టి, అభినవ్ కొత్తకొండ, తిప్పబత్తిని రవి, చిలివేరి శ్రీకాంత్, శ్రీనివాస్ పాల్గొన్నారు.


