వాహనదారుల అయోమయం
సాక్షిప్రతినిధి,కరీంనగర్:
చత్తీస్ఘడ్– తెలంగాణ– మహారాష్ట్ర రాష్ట్రాలను కలుపుతూ వేస్తున్న జాతీయ రహదారి– 563 నిర్మాణంలో కరీంనగర్ రూరల్ మండల పరిధిలోని ఇరుకుల్ల జంక్షన్ వద్ద అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్హెచ్– 563 వరంగల్– కరీంనగర్ సెక్షన్ రోడ్డు, హైదరాబాద్– రామగుండం రాజీవ్ రహదారి ఒక్కచోట కలుస్తున్నాయి. ఎన్హెచ్ 563 ఎలివేటేఎడ్ హైవే కావడంతో కింద నుంచి రాజీవ్ రహదారి వెళ్తుంది. ఈ హైవే నిర్మాణంతో కరీంనగర్లోకి భారీ వాహనాలు రాకుండా ఇరుకుల్ల నుంచే వరంగల్వైపు వెళ్తాయనుకున్నారంతా. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉంది. ఇక్కడ జగిత్యాల వైపుగా వెళ్లేందుకు అనుకూలంగా కనెక్టివిటీ ఉన్నా.. వరంగల్ వైపు వెళ్లేందుకు కనెక్టివిటీ లేదు. వాస్తవానికి ఎన్హెచ్ 563 రోడ్డు ఇంకా నిర్మాణంలోనే ఉంది. ప్రస్తుతం ఇరుకుల్ల వరకు అందుబాటులోకి వచ్చింది. వాహనాలు వరంగల్ వైపు వెళ్లేందుకు ఎలాంటి ర్యాంపు నిర్మించకపోవడంతో కరీంనగర్ వరకు ప్రయాణించి తీగల వంతెన, మానకొండూరు మీదుగా ఎన్హెచ్– 563 ఎక్కుతున్నాయి.
పెద్దపల్లి పారిశ్రామిక ప్రాంతం నుంచి నిత్యం వేలాది లారీలు ఆంధ్రప్రదేశ్, చత్తీస్ఘఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా వైపు ప్రయాణిస్తుంటాయి. బసంత్నగర్ సిమెంట్ ఫ్యాక్టరీ, సింగరేణి బొగ్గు, ఎన్టీపీసీ బూడిద, మంథని ఇసుక, వ్యవసాయ ఉత్పత్తులను తరలించే లారీలు నిత్యం కరీంనగర్– వరంగల్– విజయవాడ మధ్య తిరుగుతుంటాయి. పెద్దపల్లి నుంచి బయల్దేరిన వాహనాల్లో కొన్ని హైదరాబాద్ వైపు వెళ్లగా, మెజారిటీ వరంగల్ మీదుగా వెళ్తుంటాయి. మెడికల్ ఎమర్జెన్సీ కోసం ఎంజీఎం వెళ్లే వారు ఇదే దారిని ఎంచుకుంటారు. ఇరుకుల్ల వద్దకు రాగానే అందరికీ ఎన్హెచ్–563 హైవే శిఖరంలా దర్శనమిస్తోంది. కానీ, ఎలివేటెడ్ హైవేను ఎలా ఎక్కాలో అర్థం కాక అయోమయానికి గురవుతున్నారు. కొంతదూరం సర్వీసు రోడ్డుమీద ప్రయాణించినా ఇరుకుల్ల వాగుతో రోడ్డు మూతపడుతోంది.


