● వార్డుల వారీగా జాబితా సిద్ధం చేయాలి ● కలెక్టర్ చిత్రామిశ్రా
కరీంనగర్ అర్బన్: డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికను పారదర్శకతతో నిర్వహించాలని కలెక్టర్ చిత్రామిశ్రా ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, జమ్మికుంట, హుజూరాబాద్ మున్సిపల్ కమిషనర్లతో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై సమీక్ష నిర్వహించారు. అర్హులకు అన్యాయం జరగకుండా ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. ఒక్కొ దరఖాస్తును కనీసం రెండుసార్లు పరిశీలించి, అర్హత ప్రమాణాల ప్రకారమే నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు. సరైన కారణం లేకుండా ఏ ఒక్క దరఖాస్తును తిరస్కరించవద్దని సూచించారు. ప్రతి వార్డులో క్షేత్రస్థాయికి వెళ్లి దరఖాస్తుదారుల వివరాలను ప్రత్యక్షంగా పరిశీలించి, పారదర్శకంగా అర్హుల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు.
ఆకర్షణీయంగా కలెక్టరేట్ ద్వారం
నూతన కలెక్టరేట్లో నిర్మిస్తున్న ఆర్చీని ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ చిత్రామిశ్రా ఆదేశించారు. నూతన కలెక్టరేట్ వద్ద నిర్మాణంలో ఉన్న ఆర్చి పనులను పరిశీలించారు. ఆర్చి నుంచి ప్రధాన రహదారి వరకు ఉన్న పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. ప్రధాన గేటు నిర్మాణంతో పాటు రహదారి, ల్యాండ్ స్కేపింగ్, పచ్చదనం, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి స్వామి, ఆర్అండ్బి ఈఈ కుమారస్వామి ఉన్నారు.
కరీంనగర్టౌన్: కరీంనగర్లోని జ్యోతినగర్ అంగన్వాడీకేంద్రంలో మంగళవారం నిర్వహించిన తల్లిపా ల వారోత్సవాల్లో జిల్లా సంక్షేమాధికారి ఎం.సరస్వతి పాల్గొన్నారు. బిడ్డ పుట్టిన గంటలోపు ఇచ్చే ముర్రుపాలు అమృతంతో సమానమన్నారు. బిడ్డ జీవితాంతం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడతాయన్నారు. ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలన్నారు. తర్వాత బాలామృతం అందించాలని సూచించారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ వెంకటలక్ష్మి, చైల్డ్ హెల్ప్లైన్ కేస్ వర్కర్ మహేశ్ పాల్గొన్నారు.


