టెండర్లతో మాకేం సంబంధం?
కరీంనగర్ కార్పొరేషన్: యూఐడీఎఫ్ నిధులతో చేపట్టే పనుల టెండర్తో తమకేం సంబంధమని, బట్టకాల్చి మీద వేస్తామంటే ఊరుకునేది లేదని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హెచ్చరించారు. బీఆర్ఎస్ నాయకులు తనపై చేసిన ఆరోపణలపై క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో లీగల్నోటీసు ఇస్తామన్నారు. శనివారం నగరపాలకసంస్థ 48వ డివిజన్ విద్యానగర్ కురుమవాడలో రూ.కోటి అంచనాతో చేపట్టిన సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ వై.సునీల్రావు, నగర పాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్తో కలిసి శంకుస్థాపన చేశారు. 19వ డివిజన్లోని రేకుర్తి ముదిరాజ్ కాలనీలో రూ.40 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు, పైప్లైన్ పనులకు, లక్ష్మినరసింహకాలనీలో రూ.57 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు, పైప్లైన్ పనులకు శంకుస్థాపన చేశారు. చింతకుంటలోని బుల్సెమెన్ సెంటర్లో వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. గత పదేళ్ల పాలనలో అవినీతి, అక్రమాలు, అరాచకాలతో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ను భ్రష్టు పట్టించిన నాయకులే తమకు అవినీతి మరకలు అంటించాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. తప్పు చేయనప్పుడు భయపడాల్సిన పనిలేదని, అలాంటి వాళ్లను ఉపేక్షించాల్సిన అవసరం లేదన్నారు. క్షమాపణ చెప్పకపోతే,లీగల్ నోటీసులు పంపించేలా చూడాలని మేయర్, డిప్యూటీ మేయర్ను ఆదేశించారు. యూఐడీఎఫ్ పనుల టెండర్ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదని, అందులో తాను ఎప్పుడూ జోక్యం చేసుకోలేదన్నారు. కార్యక్రమాల్లో కార్పొరేటర్లు కర్రె పద్మ అనిల్, ఎన్నం లక్ష్మి ప్రకాశ్, సుధగోని మాధవి కృష్ణాగౌడ్, బండారి వేణు, బోయినపల్లి ప్రవీణ్రావు పాల్గొన్నారు.


