● పోలీసులను ఆశ్రయించిన వృద్ధురాలు
హుజూరాబాద్ రూరల్: కనుకులగిద్దకు చెందిన మొలుగు రాజమ్మ అనే వృద్ధురాలు శుక్రవారం హుజూరాబాద్ సీఐ కరుణాకర్ను ఆశ్రయించింది. బాధితురాలి వివరాల ప్రకారం... రాజమ్మకు ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. భర్త కొన్నేళ్ల క్రితం మృతిచెందాడు. తన కుమారులకు సమానంగా ఆస్తి పంపకాలు చేశానని, తనకు భోజనం పెట్టడం లేదంటూ పోలీసులకు వివరించింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు సీఐ విచారణ జరిపారు. ఈ విషయమై వివరణ కోరగా.. కుమారులు వంతులవారీగా సక్రమంగా చూసుకుంటున్నారన్నారు. రెండో కుమారుడు భోజనం పెట్టినా.. రాజమ్మకు నచ్చడం లేదని అన్నారు. తనవంతుగా అయ్యే ఖర్చు ఇస్తానని రెండో కుమారుడు చెబుతున్నాడని, ఈ విషయమై కుటుంబీకులు, పెద్దల సమక్షంలో మాట్లాడుకుంటామని చెప్పాడన్నారు.
ఫొటో మార్ఫింగ్ చేసి.. డబ్బులు డిమాండ్
● పోలీసుల అదుపులో యువకుడు?
చందుర్తి(వేములవాడ): యువతితో ఇన్స్ట్రాగమ్ ద్వారా పరిచయం పెంచుకున్న యువకుడు డబ్బుల కోసం ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసి బెదిరింపులకు పాల్పడడంతో విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలో చికెన్ సెంటర్ నిర్వహిస్తున్న హరీష్కు ఇన్స్ట్రాగామ్లో విజయవాడకు చెందిన ఓ యువతి పరిచయమైంది. ఆ యువతి ఫొటోలను మార్ఫింగ్ చేసి డబ్బులు డిమాండ్ చేయడంతో పరువు ఎక్కడ పోతుందోనని ఆమె రూ.20వేలు పంపినట్లు తెలిసింది. ఇదే అదనుగా భావించి మరోసారి ఫొటోలను మార్ఫింగ్ చేసి రూ.లక్ష డిమాండ్ చేయడంతో ఆ యువతి విజయవాడ పోలీసులను ఆశ్రయించింది. యువతి ఫిర్యాదుతో హరీష్ను విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
19 గ్యాస్ సిలిండర్లు సీజ్
జ్యోతినగర్: ఎన్టీపీసీ రామగుండం, గోదావరిఖని ప్రాంతంలో శుక్రవారం నిర్వహించిన తనిఖీల్లో 19 సిలిండర్లు సీజ్ చేసి, 7 హోటల్స్పై కేసులు నమోదు చేసినట్లు అదనపు కలెక్టర్ డి.వేణు ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్టీపీసీ రామగుండం రాజీవ్ రహదారి, మెయిన్ రోడ్ కృష్ణానగర్లోని ఓ హోటల్లో వివిధ హోటల్స్లో తనిఖీలు నిర్వహించామన్నారు. గృహ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న ఏడు హోటళ్లపై కేసులు నమోదు చేసి 19 సిలిండర్లు సీజ్ చేయడం చేసినట్లు పేర్కొన్నారు.


