కామారెడ్డి రూరల్: కామారెడ్డి మండలం క్యాసంపల్లి గ్రామశివారులో శుక్రవారం రాత్రి ఒంటి గంట ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. దేవునిపల్లి ఎస్సై రంజిత్ తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి పట్టణంలోని అయ్యప్పనగర్కు చెందిన సాయివర్ధన్, షేర్గల్లీకి చెందిన నందు దోమకొండకు పని నిమిత్తం వెళ్లి తిరిగి బైక్పై కామారెడ్డికి వస్తున్నారు. కామారెడ్డి బైపాస్ నుంచి క్యాసంపల్లికి వెళ్లే రోడ్డు వద్ద డంపింగ్ యార్డుకు వెళ్తున్న ట్రాక్టర్ డ్రైవర్ ఒక్కసారిగా యూటర్న్ తీసుకోవడంతో బైక్ ఢీకొట్టింది. దీంతో సాయివర్ధన్(20) అక్కడికక్కడే మృతి చెందగా, నందుకు తీవ్రగాయాలయ్యాయి. నందును కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. సాయివర్ధన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దేవునిపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రామారెడ్డి (ఎల్లారెడ్డి): మద్యానికి బానిసై ఒకరు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని రెడ్డిపేట గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రెడ్డిపేట గ్రామానికి చెందిన మహమ్మద్ ఆజాద్ (38) శనివారం సాయంత్రం ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల ఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.


