కామారెడ్డి అర్బన్: ఈనెల 27న ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని ప్రభుత్వపరంగా ఘనంగా నిర్వహించాలని పట్టణ పద్మశాలి సంఘం నాయకులు కోరారు. ఈమేరకు శనివారం కామారెడ్డి పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు సబ్బని కృష్ణహరి, ప్రధాన కార్యదర్శి జీఎన్ స్వామి, నాయకులు బాల్నర్సయ్య, శివరాములు, వెంకటస్వామి, నర్సయ్యలు అడిషనల్ కలెక్టర్ ఎన్వై గిరిని కలిసి వినతిపత్రం అంజేశారు.
కామారెడ్డి టౌన్ : పట్టణంలో చాలా ఏళ్లుగా ప్రమాదకరంగా మారిన పాత ఇనుప స్తంభాలను విద్యుత్ శాఖ అధికారులు తొలగించారు. శనివారం జిల్లా కేంద్రంలోని జేపీఎన్ రోడ్డు, సుభాష్ రోడ్డు, మాయాబజార్, సిరిసిల్లా రోడ్డు, స్టేషన్ రోడ్డు ప్రాంతాల్లో ఉన్న ఇనుప స్తంభాలను తొలగించి, వాటి స్థానంలో ఎత్తయిన సిమెంట్ స్తంభాలను అమర్చారు. ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా, అలాగే వినాయక చవితి శోభాయాత్ర నేపథ్యంలో విద్యుత్ తీగలు తగలకుండా ఎత్తుగా ఉండేలా ఈ చర్యలు చేపట్టినట్లు పట్టణ ఏఈ మనోరంజన్ తెలిపారు. లైన్ ఇన్స్పెక్టర్ శివరాములు, లైన్మెన్ స్వామి పాల్గొన్నారు.
పెద్దకొడప్గల్: మండల కేంద్రంలోని డబుల్ బెడ్ రూం ఇళ్ల సమస్యలను పరిష్కరించాలని తహసీల్దార్ రాజశేఖర్ను శనివారం కాంగ్రెస్పార్టీ ఎస్సీ సెల్ మాజీ చైర్మన్ సౌదగర్ అరవింద్ కోరారు. దీంతో డబుల్ బెడ్ రూం ఇళ్ల లబ్ధిదారులకు ఇంటి నంబర్లను కేటాయించారు. త్వరలో విద్యుత్ సమస్యను పరిష్కరిస్తానని అరవింద్ పేర్కొన్నారు. డబుల్ బెడ్ రూమ్ కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు.
పెద్దకొడప్గల్: మండలంలోని బాబుల్గావ్ గ్రామ శివారులో రూ. 7లక్షల ఆర్డబ్ల్యూఎస్ నిధులతో శనివారం నూతన బోరు వేయించినట్లు ఎంపీడీవో అభినవ్ చందర్ తెలిపారు. మండలంలోని బాబుల్గావ్ గ్రామంలో నెలకొన్న తాగునీటి ఎద్దడిపై ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీంతో సమస్యల పరిష్కారంపై కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ప్రత్యేక దృష్టి సారించారు. తాగునీటి సమస్య పరిష్కారం కావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రాచప్ప, సర్పంచ్ రవికుమార్, మాజీ ఎంపీటీసీ విఠల్ రెడ్డి, ఉప సర్పంచ్ బీరప్ప పాల్గొన్నారు.
● నిజామాబాద్ ఆర్ఎం.కృష్ణమూర్తి
నిజామాబాద్ రూరల్: టీజీఎస్ ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు అక్టోబర్ 9న నిర్వహించనున్నట్లు నిజామాబాద్ రీజియన్ మేనేజర్ కృష్ణమూర్తి ‘సాక్షి’కి తెలిపారు. రీజియన్ పరిధిలో నిజామాబాద్–1, 2 కామారెడ్డి, బోధన్, ఆర్మూర్, బాన్సువాడ డిపోల వారీగా ఎన్నికలు ఉంటాయని పేర్కొన్నారు. ఓటరు జాబితాను త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు. ఎన్నికలను కార్మిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తారని, అక్టోబర్ 17న ఫలితాల వెల్లడి ఉంటుందని వివరించారు.


