● లోలెవల్ వంతెన రింగుల్లో
పేరుకుపోయిన చెత్త
● వరద పోటెత్తడంతో పైనుంచి
ప్రవహించిన వర్షపునీరు
● రాకపోకలకు తీవ్ర అంతరాయం
మోపాల్: మండలంలోని గున్యానాయక్ తండా వద్దగల లో–లెవల్ వంతెనపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. సమీప అటవీ ప్రాంతాల్లో సోమవారం మధ్యాహ్నం తర్వాత భారీగా వర్షం కురవడంతో ఎగువ నుంచి వరద పోటెత్తింది. దీంతో వంతెన కింద ఉన్న రింగుల్లో చెత్తాచెదారం, చెట్ల కొమ్మలు అడ్డురావడంతో నీరంతా పై నుంచి ప్రవహించింది. ఈక్రమంలో వాహనదారులు, పాదచారులు రాకపోకలు సాగించడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొందరు ఒకరిసాయంతో మరొకరు జాగ్రత్తగా రోడ్డును దాటి ఇళ్లకు చేరుకున్నారు. గతంలో కూడా ఇలా గే చెత్త పేరుకుపోతే జేసీబీ సాయంతో తొలగించారని గ్రామస్తులు తెలిపారు. హైలెవల్ వంతెన నిర్మించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.


