● రాష్ట్ర ప్రభుత్వానికి విద్యాశాఖ
ప్రతిపాదనలు
● వచ్చే విద్యాసంవత్సరం నుంచి
అమలయ్యే అవకాశం
ఎల్లారెడ్డిరూరల్: మోడల్స్కూల్స్ను బలోపేతం చేసేందుకు గాను ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగానే సీబీఎస్ఈ విధానం అమలు చేయాలని విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే 2027–28 విద్యా సంవత్సరం నుంచి ఈ విధానాన్ని అమలు చేయాలని ప్రణాళిక రూపొందించారు. దీనిద్వారా సంబంధిత పాఠశాలలు సీబీఎస్ఈ బోర్డు నుంచి అనుబంధ గుర్తింపును పొందవలసి ఉంటుంది.
జిల్లాలో ఆరు మోడల్స్కూల్స్..
కామారెడ్డి జిల్లాలో ఎల్లారెడ్డి, నిజాంసాగర్(అచ్చంపేట్), బాన్సువాడ(కొత్తాబాది), నాగిరెడ్డిపేట(గోపాల్పేట్), మద్నూర్(మేనూర్), సదాశివనగర్లలో మోడల్స్కూల్స్ ఉన్నాయి. ప్రతి మోడల్స్కూ ల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 500 మంది, ఇంటర్మీడియట్లో 320 మంది విద్యార్థులకు అడ్మిషన్లు నిర్వహించాల్సి ఉంది. ప్రస్తుతం నాగిరెడ్డిపేటలో 778, సదాశివనగర్లో 742, బాన్సువాడలో 735, నిజాంసాగర్లో 728, ఎల్లారెడ్డిలో 684, మద్నూర్లో 656 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ప్రతి మోడల్స్కూల్లో ఇంటర్మీడియట్ విద్యార్థినుల కోసం వంద మందికి హాస్టల్ వసతిని కల్పిస్తున్నారు.
జాతీయస్థాయి పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించే అవకాశం..
జాతీయ స్థాయి కాంపీటీటివ్ పరీక్షలకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) సిలబస్తో కూడిన పరీక్షా విధానం ఉంటుంది. దీనివల్ల సీబీఎస్ఈ విధానంతో చదువుకున్న విద్యార్థులు ఆయా పరీక్షల్లో ప్రతిభ చూపి మంచి ర్యాంకులను సాధించి మంచి కళాశాలల్లో సీట్లను సాధిస్తున్నారు. స్టేట్ సెలబస్తో చదువుకున్న విద్యార్థులు కాంపిటీటివ్ పరీక్షలలో వెనకబడడంతో మంచి ర్యాంకులు రాక మంచి కళాశాలల్లో సీట్లు లభించక చదువులో వెనకంజలో ఉంటున్నారు. మోడల్స్కూల్స్లో సీబీఎస్ఈ విధానం అమలైతే గ్రామీణ ప్రాంత విద్యార్థులు సైతం జాతీయస్థాయి కాంపిటీటివ్ పరీక్షలలో ఉత్తమ ర్యాంకులు సాధించి మంచి కళాశాలల్లో సీట్లు సాధించే అవకాశం ఉంటుంది.
ఎల్లారెడ్డిలో గల మోడల్స్కూల్


