పనులు పూర్తయితేనే వెలుగులు...
నిజాంసాగర్ ప్రాజెక్టు హెడ్స్లూయిస్ వద్ద 1954లో జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పారు. ఇంగ్లండ్లో తయారైన మూడు టర్బయిన్లు తీసుకొచ్చి బిగించారు. 1954 ఫిబ్రవరి 23న తొలి యూనిట్ను, 1955 నవంబర్ 28న రెండో యూనిట్ను, తర్వాత కొంతకాలానికే మూడో యూనిట్ను ప్రారంభించారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు అప్పట్లో రూ. 2.27 కోట్లు ఖర్చు చేశారు. ఒక్కో టర్బయిన్ ద్వారా ఐదు మెగావాట్ల చొప్పున రోజుకు 15 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగేలా దీనిని నిర్మించారు. 1974 ప్రాంతంలో మూడో టర్బయిన్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో దానిని పక్కన పెట్టేశారు. అప్పటినుంచి రెండు టర్బయిన్ల ద్వారా మాత్రమే కరెంటు ఉత్పత్తి అవుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండి పంటలకు విడుదల చేసే నీటి ఆధారంగా ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. నీరు పుష్కలంగా ఉండడం, హెడ్ స్లూయిస్ ద్వారా నీటిని విడుదల చేసినన్ని రోజులు జల విద్యుత్ ఉత్పత్తికి మంచి అవకాశాలు ఉంటాయి.
రూ.10.76 కోట్ల నిధులు..
నిజాంసాగర్ జల విద్యుత్ కేంద్రం పునరుద్ధరణ, ఆధునికీకరణ (ఆర్ఎండ్ఎం) ప్రాజెక్టుకు 2017లో రూ.10.76 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వం గ్రాంటుగా 50 శాతం అంటే రూ.5.36 కోట్లు, అలాగే 50 శాతం టీజెన్కో భరించాల్సి ఉంటుంది. జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం గురించి ఇటీవల పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణకు చెందిన పలువురు ఎంపీలు ప్రస్తావించగా.. కేంద్ర పునరుత్పాదన, ఇంధన శాఖ మంత్రి లోక్సభలో ప్రాజెక్టు వివరాలు వెల్లడించారు. ఆధునికీకరణ పనుల పూర్తికి గడువును 2027 నవంబర్ 10 వరకు పొడగించినట్లు తెలిపారు.
జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పునరుద్ధరణ, ఆధునికీకరణ పనులు పూర్తయితేనే విద్యుత్ ఉత్పత్తి మొదలవుతుంది. రెండు యూనిట్లలో ఒక యూనిట్ పనులు జరుగుతున్నాయని, అవి రెండు, మూడు నెలల్లో పూర్తవుతాయని జెన్కో డీఈ రవి కుమార్ తెలిపారు. ఒకటి పూర్తయిన తర్వాత రెండో యూనిట్ పనులు చేపడతామని పేర్కొన్నారు. అయితే నత్తనడకన సాగుతుండడంతో పొడిగించిన గడువులోగా పనులు పూర్తవడం అసాధ్యమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
నత్తనడకన నిజాంసాగర్ జల
విద్యుదుత్పత్తి కేంద్రం ఆధునికీకరణ
నాలుగేళ్లయినా పూర్తి కాని పనులు
గడువు పొడిగించిన సర్కారు..
వచ్చే ఏడాదైనా ఉత్పత్తి
ప్రారంభమయ్యేనా?


