బాన్సువాడ రూరల్/కామారెడ్డి టౌన్/తాడ్వాయి/పిట్లం: వర్షాకాలంలో సీజనల్గా సంభవించే వ్యాధులు ప్రబలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హన్మాజీపేట్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డా. ప్రసన్నమీన అన్నారు. శుక్రవారం బోర్లంక్యాంపు తండా గ్రామ పంచాయతీలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. రోగులను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. జిల్లా కేంద్రంలోని 46, 47వ వార్డుల పరిధిలోని బీసీ హాస్టల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. యూపీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చందనప్రియ వార్డు కాలనీవాసులకు వైద్య పరీక్షలు చేపట్టారు. తాడ్వాయి మండలం బ్రహ్మాజివాడి గ్రామంలో ఉచిత వైద్యశిబిరాన్ని నిర్వహించారు. ఈశిబిరంలో 200మందికి వైద్య పరీక్షలు చేసి మాత్రలు పంపిణీ చేశారు. పిట్లం ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించినట్లు ఆప్తాల్మిక్ ఆఫీసర్ హరికిషన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ శిబిరంలో కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.
దివ్యాంగులకు ఫిజియోథెరపీ
పిట్లం(జుక్కల్): మండల కేంద్రంలోని భవిత కేంద్రంలో దివ్యాంగులకు ఫిజియోథెరపీ నిర్వహించారు.వైద్యురాలు సారిక కేంద్రంలోని దివ్యాంగులకు పరీక్షలు నిర్వహించారు. ఐఈఆర్పీ కమల్ కిషోర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


