వేల్పూర్(మెండోరా)/నిజామాబాద్ అర్బన్: సరదాగా పిక్నిక్కు వెళ్లిన చేతికొచ్చిన కొడుకులు నీటమునిగి మృత్యువాతపడడంతో కన్నవారు కన్నీటి పర్యంతమవుతున్నారు. రెక్కాడితేగాని డొక్కాడని ఆ కుటుంబాల రెక్కలు తెగిపోయాయి! నిజామాబాద్ నగరంలోని ఆటోనగర్కు చెందిన అమ్ము అలియాస్ నజువత్(24), అజీమ్(24), అర్సపల్లికి చెందిన కలీం(23), మహారాష్ట్రలోని భోకర్కు చెందిన అర్హాన్(17)తోపాటు మరో యువకుడు కలిసి ఆదివారం ఎస్సారెస్పీ ప్రాంతానికి పిక్నిక్కు వెళ్లారు. ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ ప్రాంతంలోని లక్ష్మీకాలువ హెడ్రెగ్యులేటరీ వద్ద కాలువలో నలుగురు గల్లంతయ్యారు. సమాచారం అందిన వెంటనే పోలీసు, రెవెన్యూశాఖ అధికారులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్లు , ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అగ్నిమాపక సిబ్బంది సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టి ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. అర్హాన్ ఆచూకీ లభించలేదు. సీపీ సాయిచైతన్య గాలింపు చర్యలను పర్యవేక్షించారు.
అజీమ్ఖాన్ డిచ్పల్లిలోని ఓ ప్రైవేట్ షోరూమ్లో ఎలక్ట్రిషియన్గా పనిచేస్తూ కుటుంబానికి అండగా ఉన్నాడు. ఆదివారం సెలవు కావడంతో ఇంట్లోనే ఉన్న అజీమ్ను స్నేహితులు వచ్చి వెంట తీసుకెళ్లారని తెలిసింది. అతడి తండ్రి ఉస్మాన్ఖాన్ బియ్యం దుకాణంలో పని చేస్తున్నాడు. చేతికొచ్చిన కొడుకు మృతి చెందడంతో తండ్రి షాక్లోకి వెళ్లాడు.
అజీమ్, కలీం, నజువత్, అర్హాన్ (ఫైల్)
వేల్పూర్(మెండోరా) : ఎస్సారెస్పీలో యువకులు గల్లంతైన సమాచారం అందుకున్న సీపీ సాయిచైతన్య హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్రెడ్డి, ఆర్మూర్ రూరల్ సీఐ జాన్రెడ్డితో మాట్లాడి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. ముగ్గురు యువకుల మృతదేహాలను గజఈతగాళ్లు వెలికితీశారు. సుమారు 8.30గంటల వరకు ప్రాజెక్టు ప్రాంతంలోనే ఉన్న సీపీ.. మరో యువకుడి ఆచూకీ గుర్తింపు కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని సూచించారు. మెండోరా ఎస్సై సుహాసిని, స్థానిక సిబ్బంది, ఇతర శాఖల అధికారులు ఉన్నారు.
ఎస్సారెస్పీ ప్రాంతానికి సరదాగా
పిక్నిక్కు వెళ్లి కానరాని లోకాలకు
లక్ష్మీకాలువలో నలుగురు
యువకుల గల్లంతు
మగ్గురి మృత్యువాత.. లభించని మరొకరి ఆచూకీ
జిల్లా కేంద్రంలోని ఆటోనగర్,
అర్సపల్లిలో విషాదఛాయలు


