నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో..
● నీటిని పొదుపుగా వాడాలి
● ఎల్నినో ప్రభావంపై రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్త జేకే రేవంత్ నాథన్ సూచన
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి) : ఎల్ని నో ప్రభావం నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలవైపు దృష్టిసారించాలని నాగిరెడ్డిపేట మండ లం మాల్తుమ్మెదలోని తెలంగాణ రైతు విజ్ఞానకేంద్రం(టీఆర్వీకే) సమన్వయకర్త డాక్టర్ జేకే రేవంత్ నాథన్ సూచిస్తున్నారు. వాతావరణ పరిస్థితుల్లో చోటుచేసు కుంటున్న మార్పుల కారణంగా ఈ ఏడాది ఎల్నినో ప్రభా వం స్పష్టంగా కనిపించే అవకాశం ఉందన్నారు. ఈనేపథ్యంలో ఆదివారం రైతులకు పలు సూచనలు, సలహాలు చేశారు.
లోటు వర్షపాతం..
జిల్లాలో ఇప్పటివరకు నమోదైన వర్షపాతం సాధారణ స్థా యి కంటే తక్కువగా ఉండటంతో రైతులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. వాతావరణశాఖ సూచించిన గణాంకాల ప్రకారం జిల్లాలో సగటు వర్షపాతం సాధారణ స్థాయి కంటే సుమారు 18శాతం తక్కువగా ఉంది. జిల్లాలో వాస్తవ వర్షపాతం 278.0మిల్లీమీటర్లు ఉండగా సాధారణ వర్షపాతం 337.5మిల్లీమీటర్లుగా నమోదయింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే జిల్లాలో సాగునీటి కొరత ఏర్పడి పంటల ఎదుగుదలపై ప్రభావం పడే అవకాశం ఉంది. చెరువులు, రిజర్వాయర్లతోపాటు భూగర్భజలాల పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని రైతులు నీటిని పొదుపుగా వినియోగించాలి. బోరు మోటార్లు ఎక్కువ సమయం పనిచేస్తే విద్యుత్ డిమాండ్ పెరుగుతుంది. ఫలితంగా విద్యుత్ వ్యవస్థపై అదనపు భారం పడి రైతులకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడం కష్టతరమవుతుంది.
నీటికొరత ఉన్న ప్రాంతాల్లో తక్కువనీటితో సాగయ్యే ప ప్పుధాన్యాలు, నూనెగింజలతోపాటు ఇతర ఆరుతడి పంటలను సాగుచేయడం ఉత్తమం. వరికి బదులుగా మొక్కజొన్న, కందులు, పెసలు, మినుములు, శనగలు, నువ్వులు, వేరుశనగవంటి తక్కువ నీటితో పెరిగే పంటలను సాగుచేయడం ద్వారా దిగుబడి నష్టాలను తగ్గించు కోవచ్చు. పశుగ్రాస పంటలను కూడా సాగులో భాగంచేయడం వల్ల పశుసంపదకు మేలు కలుగుతుంది.
వర్షపాతం లోటు ఉన్నప్పుడు వరి సాగు కోసం బోర్ల పై పూర్తిగా ఆధారపడకూడదు.
ఒకేపంట కాకుండా పంటమార్పిడి చేపట్టాలి.
నీటిలభ్యత ఆధారంగా అధికనీటి వినియోగ పంట లు, మధ్యస్థ నీటి వినియోగ పంటలు, తక్కువ నీటివియోగ పంటలను ప్రణాళిక చేసుకోవాలి.
పంట అవశేషాలను కాల్చకుండా నేలలో కలిపి నేల తేమను సంరక్షించాలి.
వీలైనచోట్ల మల్చింగ్ షీట్ల వినియోగం, అంతరపంటల సాగు, పంటమార్పిడి, వర్షపునీటి సంరక్షణ పద్ధతులను పాటించాలి.
బోరునీటిని విచక్షణారహితంగా వినియోగించకుండా నీటిబడ్జెట్ ఆధారంగా పంటప్రణాళిక రూపొందించుకోవాలి.
స్థానిక వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటిస్తూ వాతావరణ సూచనల ఆధారంగా రైతులు పంటసాగు నిర్ణయాలు తీసుకోవాలి.


