వెంకట్రెడ్డి ఏడున్నడో?
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 1990 ప్రాంతంలో నక్సల్స్ ఉద్యమం విస్తరించింది. అప్పట్లో సిర్నాపల్లి, కామారెడ్డి, ఎల్లారెడ్డి, కౌలాస్, భీంగల్, సిరిసిల్ల దళాలు క్రియాశీలకంగా పనిచేసేవి. కొన్ని ప్రాంతాల్లో అప్పట్లో పీపుల్స్వార్ నక్సల్స్ సమాంతర పాలన సాగించారు. రామారెడ్డి, మాచారెడ్డి, సిరికొండ, ఇందల్వాయి, ధర్పల్లి, భీంగల్, మోర్తాడ్, కమ్మర్పల్లి, తాడ్వాయి, రాజంపేట, లింగంపేట, గాంధారి, వర్ని, జక్రాన్పల్లి, డిచ్పల్లి తదితర మండలాల్లోని కొన్ని గ్రామాల్లో నక్సల్స్ ఏది చెబితే అదే నడిచింది. కొన్ని గ్రామాల్లో అయితే పంచాయతీ ఎన్నికలు కూడా జరిగేవి కాదు. గ్రామ అభివృద్ధి కమిటీలు, గ్రామ రాజ్య కమిటీల ఆధ్వర్యంలో పాలన నడిచేది. అంతలా సాగిన నక్సలైట్ ఉద్యమంపై చంద్రబాబు హయాంలో ప్రభుత్వం తీవ్ర నిర్బంధం అమలు చేసింది. ఎన్కౌంటర్లు పెద్ద సంఖ్యలో జరిగాయి. అప్పట్లో దాదాపు 125 మంది ఎన్కౌంటర్లలో చనిపోయారు. వందలాది మంది అరెస్టయి జైలుపాలయ్యారు. కొందరు లొంగిపోయారు. దీంతో నక్సలైట్ ఉద్యమం దెబ్బతింది.
మానాల ఎన్కౌంటర్ తర్వాత..
రాష్ట్ర ప్రభుత్వం నక్సలైట్లతో చర్చలు జరిపిన సమయంలో ఉమ్మడి జిల్లాలో కార్యదర్శిగా పనిచేసిన రమేశ్ అలియాస్ గంగుల వెంకటస్వామి ఆధ్వర్యంలో ఊరూరా సభలు, సమావేశాలు నిర్వహించారు. ఉద్యమాన్ని బలోపేతం చేసే ప్రయత్నం జరిగింది. అయితే 2005 మార్చి 7న మానాల సమీపంలో జరిగిన ఎన్కౌంటర్లో అప్పటి జిల్లా కార్యదర్శి రమేశ్ అలియాస్ గంగుల వెంకటస్వామి, జిల్లా కమిటీ సభ్యుడు కొమ్ము బాబు సహా పది మంది నక్సల్స్ ఎన్కౌంటర్లో చనిపోయారు. ఈ ఎన్కౌంటర్తో ఉమ్మడి జిల్లాలో నక్సల్స్ కార్యకలాపాలు పూర్తిగా కనుమరుగయ్యాయి.
సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన లింబయ్యగారి వెంకట్రెడ్డి 1999లో అజ్ఞాతంలోకి వెళ్లినట్లు పోలీసు రికార్డుల్లో ఉంది. ఆయనపై రూ.లక్ష రివార్డు ఉంది. అయితే ఏ ప్రాంతంలో, ఏ స్థాయిలో పనిచేస్తున్నాడో కూడా తెలియదు. ఇందల్వాయి మండలానికి చెందిన ఒకరు కూడా అజ్ఞాతంలో ఉన్నట్లు అప్పట్లో పోలీసులు పేర్కొన్నారు. వీరిద్దరి వివరాలు పెద్దగా తెలియడం లేదు. దీంతో ఉమ్మడి జిల్లాలో నక్సలైట్ ఉద్యమం పూర్తిగా కనుమరుగైనట్టేనని భావిస్తున్నారు.
ఒకప్పుడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో సమాంతర పాలన సాగించిన నక్సల్స్.. ఆ తర్వాత లొంగుబాట్లు, ఎన్కౌంటర్లు, అరెస్టులతో ఉనికిలో లేకుండా పోయారు. దండకారణ్యంలో ఉన్నవారిలో పలువురు లొంగిపోగా.. ఇటీవల స్వామి ఎన్కౌంటర్లో హతమయ్యారు. దీంతో ఉమ్మడి జిల్లాలో అన్నల శకం ముగిసినట్లేనని భావిస్తున్నారు.
– సాక్షి ప్రతినిధి, కామారెడ్డి
మానాల ఎన్కౌంటర్కు ముందే కామారెడ్డి మండలం ఇస్రోజీవాడి గ్రామానికి చెందిన లోకేటి చందర్ అలియాస్ స్వామి అలియాస్ ప్రభాకర్ దండకారణ్యానికి వెళ్లారు. కొంతకాలానికే ఆయన భార్య సులోచన సైతం అడవి బాట పట్టింది. వాళ్ల పిల్లలు రమేశ్, లావణ్య కూడా అదే దారిలో నడిచారు. నలుగురూ గడ్చిరోలి, బస్తర్ తదితర ప్రాంతాల్లో పనిచేశారు. అయితే సులోచన అనారోగ్యంతో చనిపోయింది. రమేశ్ ఇటీవలే లొంగిపోయాడు. లావణ్య అరైస్టె రాయ్పూర్ జైలులో ఉంది. మావోయిస్టు పార్టీ లో కీలక నేతగా పనిచేసిన లోకేటి చందర్ అలియాస్ ప్రభాకర్ గత నెలలో గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయారు. పాల్వంచ మండలం ఆరెపల్లికి చెందిన ఎర్రగొల్ల రవి ఈ మధ్యే పోలీసులకు లొంగిపోయారు. ఉమ్మడి జిల్లా నుంచి ఒకరిద్దరు మాత్రమే అజ్ఞాతంలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇటీవల గడ్చిరోలి ఎన్కౌంటర్లో
స్వామి హతం
పోలీసులకు లొంగిపోయిన
ఎర్రగొల్ల రవి, లోకేటి రమేశ్
రాయ్పూర్ జైల్లో లోకేటి లావణ్య


