హోరెత్తిన ప్రచారం!
● ఆఖరి నిమిషం దాకా గల్లీలు
చుట్టేసిన ముఖ్య నేతలు
● ర్యాలీలు నిర్వహించిన అభ్యర్థులు
జిల్లాకేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి
మున్సిపల్ ఎన్నికలలో విజయం కోసం ప్రధాన పార్టీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఆయా పార్టీల అభ్యర్థుల తరఫున ముఖ్యనేతలు జోరుగా ప్రచారంలో పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ గతనెల 27న వెలువడింది. అదే రోజునుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఈనెల 3న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో అభ్యర్థుల లెక్కతేలింది. దీంతో అభ్యర్థులు ప్రచారాన్ని ఉధృతం చేశారు. అభ్యర్థులతోపాటు ఆయా పార్టీల తరఫున పలువురు ముఖ్యనేతలు సైతం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్, బీఆర్ఎస్ పక్షాన ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్షోలు, సభలలో పాల్గొన్నారు.
ఎల్లారెడ్డిలో..
ఎల్లారెడ్డి బల్దియాలో కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ఎమ్మెల్యే మదన్మోహన్రావు, ఎంపీ సురేశ్ షెట్కార్లు తమ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. అభివృద్ధి కోసం కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థుల విజయం కోసం మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ విస్తృతంగా ప్రచారం చేశారు. తమ హయాంలోనే అభివృద్ధి జరిగిందని, బల్దియా ఎన్నికలలో మెజారిటీ సీట్లు తమకే దక్కుతాయని ఆయన ధీమాతో ఉన్నారు. బీజేపీ అభ్యర్థుల పక్షాల ఆ పార్టీ నేతలు పైడి ఎల్లారెడ్డి, బాణాల లక్ష్మారెడ్డి తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు.
బాన్సువాడలో..
బాన్సువాడలో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుకోసం ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్రాజు, డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి ప్రచారం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్తో పాటు స్థానిక నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణతోపాటు పలువురు నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
బిచ్కుందలో..
బిచ్కుంద మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు విస్తృతం ప్రచారం చేశారు. బీఆర్ఎస్ తరఫున మాజీ ఎమ్మెల్యే హన్మంత్ సింధే వార్డులను కలియ తిరిగారు. బీజేపీ అభ్యర్థుల గెలుపుకోసం మాజీ ఎంపీ బీబీ పాటిల్, మాజీ ఎమ్మెల్యే అరుణతార, పార్టీ నేతలు ప్రచారంలో పాల్గొన్నారు.
అందరిలోనూ గెలుపు ధీమా
నాలుగు మున్సిపాలిటీలలో ప్రచారం ముగిసిన తర్వాత ఆయా పార్టీల నేతలు మీడియాతో మాట్లాడారు. తమతమ పార్టీలకు చెందిన అభ్యర్థులు మెజారిటీ వార్డుల్లో విజయం సాధించి మున్సిపాలిటీలను కై వసం చేసుకుంటామన్న ధీమాను వారు వ్యక్తం చేశారు. ప్రచారం ముగియడంతో అభ్యర్థులు సైలెన్స్ పీరియడ్లో నిశ్శబ్దంగా ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు.
కామారెడ్డి 33వ వార్డులో ప్రచారంలో
పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్
కామారెడ్డి పదో వార్డులో ప్రచారంలో
పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
కామారెడ్డి మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పలు వార్డుల్లో విస్తృతంగా పర్యటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నందున అభివృద్ధికి ఎక్కువ నిధులు తీసుకురాగలుగుతామని చెబుతూ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు. మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పలు వార్డుల్లో ఓటర్ల దగ్గరకు వెళ్లి బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని చూసి తమ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ అభ్యర్థుల తరఫున స్థానిక ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి విస్తృతంగా ప్రచారంలో పాల్గొన్నారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికై న తర్వాత అవినీతికి అడ్డుపడిందని, అక్రమాలకు తెరపడిందని పేర్కొంటూ బల్దియాపై బీజేపీ జెండా ఎగురవేయాలని ఓటర్లను కోరుతున్నారు.
హోరెత్తిన ప్రచారం!


