పకడ్బందీగా ఏర్పాట్లు
కౌంటింగ్కూ సిద్ధంగా..
● నాలుగు మున్సిపాలిటీల్లో 239 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు
● ప్రతి ఓటరూ ఓటుహక్కు వినియోగించుకోవాలి
● ‘సాక్షి’ ఇంటర్వ్యూలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
‘‘జిల్లాలో నాలుగు మున్సిపాలిటీల పరిధిలో 92 వార్డులున్నాయి. ఓటర్లకోసం 239 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశాం. ప్రతి ఓటరు స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి’’ అని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై సోమవారం ఆయన ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు.. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి
జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలో కలిపి 1,49,525 మంది ఓటర్లు ఉన్నారు. కామారెడ్డిలో 99,313 మంది, ఎల్లారెడ్డిలో 13,265 మంది, బాన్సువాడలో 24,188 మంది, బిచ్కుందలో 12,759 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కామారెడ్డి బల్దియాలో 49 వార్డులు ఉండగా.. 152 పోలింగ్ కేంద్రాలు, ఎల్లారెడ్డిలో 12 వార్డులకు 24, బాన్సువాడలో 19 వార్డులకు 39, బిచ్కుందలో 12 వార్డులకు 24 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశాం.
బరిలో 447 మంది అభ్యర్థులు
జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో 92 వార్డులకుగాను 447 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు అన్ని స్థానాల్లో పోటీ చేస్తుండగా.. బీజేపీ 89 స్థానాల్లో పోటీలో ఉంది. ఎంఐఎం పదిచోట్ల, బీఎస్పీ నాలుగు చోట్ల, సీపీఎం మూడుచోట్ల, ఆప్ ఒక వార్డులో అభ్యర్థులను నిలిపాయి. ఇతర రాష్ట్రాలలో గుర్తింపు పొందిన పార్టీలనుంచి 18 మంది, స్వతంత్రులు 138 మంది పోటీలో ఉన్నారు.
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి
జిల్లాలో 21 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా, 68 కేంద్రాలను అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించాం. ఆ యా కేంద్రాలలో పోలింగ్ సరళిని పరిశీలించడానికి మైక్రో అబ్జర్వర్లను నియమించాం. అలాగే అన్ని కేంద్రాల్లో వంద శాతం వెబ్కాస్టింగ్ ఉంటుంది. ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసు అధికారులు భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అక్రమాలకు ఆస్కారం లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశాం.
1,398 మంది
సిబ్బంది...
పోలింగ్ నిర్వహణ కోసం 1,398 మంది సిబ్బందిని నియమించి వారికి శిక్షణ ఇచ్చాం. కామారెడ్డిలో 883 మంది, ఎల్లారెడ్డిలో 142 మంది, బాన్సువాడలో 229 మంది, బిచ్కుందలో 144 మంది సిబ్బందిని నియమించాం. ర్యాండమైజేషన్ ప్రక్రియను కూడా పూర్తి చేశాం. ఎన్నికల రిటర్నింగ్ అధికారులుగా కామారెడ్డిలో 17 మంది, ఎల్లారెడ్డిలో నలుగురు, బాన్సువాడలో ఏడుగురు, బిచ్కుందలో నలుగురు విధులు నిర్వహిస్తున్నారు.
ఈనెల 13న జరిగే కౌంటింగ్కు అవసరమైన ఏర్పాట్లు చేశాం. కామారెడ్డి మున్సిపాలిటీకి సంబంధించి జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలోని ఏఎంసీ గోదాంలో కౌంటింగ్ కేంద్రం ఉంది. ఎల్లారెడ్డి బల్దియాకు సంబంధించి ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, బాన్సువాడలో ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కాలేజీలో, బిచ్కుందలో ఏఎంసీలో కౌంటింగ్ నిర్వహిస్తాం.
పకడ్బందీగా ఏర్పాట్లు


