భక్తితో పాటు క్రమశిక్షణ అవసరం
● గణపతి సచ్చిదానంద స్వామి
● నిజామాబాద్లోని ఉత్తర తిరుపతి
ఆలయంలో ప్రవచనాలు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ముక్కోటి ఏకాదశి పర్వదినం నేపథ్యంలో మంగళవారం జిల్లా వ్యాప్తంగా వైష్ణవాలయాలకు భక్తులు పోటెత్తారు. అడుగడుగునా గోవింద నామస్మరణతో మార్మోగాయి. ఇందూరు నగరంలోని ఉత్తర తిరుపతి ఆలయంలో మైసూరు దత్తపీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి భక్తులకు ప్రవచనాలు చెప్పారు. సచ్చిదానంద స్వామి విలేకరులతో మాట్లాడారు. ప్రతిఒక్కరూ భక్తితో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలన్నారు. విద్యార్థులు విద్యాభ్యాసం విషయంలో ఏకాగ్రతతో వ్యవహరించాలన్నారు. స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోవద్దన్నారు. ఫోన్లతో సైతం ఉపయోగాలు ఉంటాయని, వాటిని అవసరం మేరకు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇందూరులోని ఉత్తర తిరుపతి ఆలయం తిరుపతి ఆలయం మాదిరిగా నిర్మాణం చేశామన్నారు. ఇక్కడ వేంకటేశ్వరస్వామి ఆలయంతో పాటు దత్తాత్రేయ, ఆంజనేయస్వామి, లక్ష్మీ అమ్మవారు, శ్రీచక్రం ఉన్నాయన్నారు. అయోధ్య ఆలయం శైలిలో ఉత్తర తిరుపతి ఆలయ నిర్మాణం ఉందన్నారు. ప్రతి మనిషికి సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఆధ్యాత్మిక చింతన ఉండాలన్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లాంటి పరిజ్ఞానాన్ని మంచికి వాడాలన్నారు. పిల్లలను ఆధ్యాత్మికం వైపు నడిపేందుకు పెద్దలు కృషి చేయాలన్నారు. వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనంతో మోక్షం కలుగుతుందన్నారు. ప్రతిఒక్కరూ సనాతన ధర్మాన్ని పాటించాలన్నారు. ఉత్తర తిరుపతి ఆలయంలో వేంకటేశ్వర స్వామిని పోలీసు కమిషనర్ పోతరాజు సాయిచైతన్య ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లాకేంద్రంలోని రామాలయంలోనూ ముక్కోటి వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి.
భక్తితో పాటు క్రమశిక్షణ అవసరం


