పత్తాలేని పాస్బుక్!
ఆరు నెలలైంది..
తొమ్మిది నెలలైంది..
రైతులకు తప్పని తిప్పలు..
కామారెడ్డి క్రైం : భభూముల రిజిస్టేషన్లు చేసుకుని నెలలు గడుస్తున్నా రైతులకు పట్టా పాస్పుస్తకాలు రావడం లేదు. నూతన పట్టా పాస్బుక్ల కోసం నెలలుగా రైతులు నిరీక్షిస్తున్నారు. దీంతో కొత్తగా భూములు కొనుగోలు చేసిన రైతులు సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారు. ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన బిల్లులు పెండింగ్లో ఉన్న కారణంగా పాస్బుక్లు తయారు చేసి ఇచ్చే ఏజెన్సీలు ప్రింటింగ్ కార్యకలాపాలను నిలిపివేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ధరణి స్థానంలో భూభారతి వచ్చాక కొన్ని సాంకేతిక అంశాల జోడింపు కారణాలతో పాస్బుక్ ప్రింటింగ్ను ప్రభుత్వమే ఆపిందని అధికారులు చెబుతున్నారు. కారణమేదైనా దాదాపు సుమారు 6 నెలలు నుంచి పాస్బుక్లు రావడం లేదు.
ధరణి పోయి భూభారతి వచ్చినా..
గత ప్రభుత్వం ధరణి వెబ్సైట్ను తీసుకువచ్చి రెవెన్యూ రికార్డులను ఆన్లైన్ చేసే ప్రక్రియను 2016లో మొదలుపెట్టి 2018 వరకు చేపట్టింది. రికార్డులను ఆన్లైన్ చేసే క్రమంలో అనేక తప్పిదాలు దొర్లాయి. లక్షల మందికి సంబంధించి రికార్డులు తప్పుగా నమోదయ్యాయి.ఽ ధరణిలో సమస్యల పరిష్కారానికి అన్ని రకాల మాడ్యూల్స్ అందుబాటులో లేకపోవడంతో రైతుల సమస్యలు పేరుకుపోయాయి. దీంతో ధరణిపై తీవ్రమైన ఆరోపణలు, విమర్శలు వచ్చాయి. అయితే తాము అధికారంలోకి రాగానే ధరణిని రద్దు చేసి రైతుల సమస్యలకు పరిష్కారం చూపుతామని కాంగ్రెస్ ప్రకటించింది. హామీ మేరకు 6 నెలల క్రితం ధరణి వెబ్సైట్ను రద్దు చేసి దాని స్థానంలో భూ భారతిని తీసుకువచ్చింది. అప్పటి నుంచి పట్టాపాస్ పుస్తకాల ప్రింటింగ్, సరఫరా నిలిచిపోయింది. నిత్యం అన్ని మండల రెవెన్యూ కార్యాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా నిత్యం 90 నుంచి 100 రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. వాటిలో సగం వరకు కొత్తగా భూమిని కొనుగోలు చేసిన వారు, వారసత్వం కింద తమ పేరిట భూములు నమోదు చేసుకునే వారుంటారు. పాస్బుక్ పోగొట్టుకున్న వారు కూడా చాలామంది కొత్త పాస్బుక్ కోసం దరఖాస్తు చేసుకుంటారు. జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలో కొత్త పాస్బుక్ల కోసం చేసుకున్న దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి.
భూములు రిజిస్ట్రేషనై నెలలు గడుస్తున్నా..
నిలిచిన పాస్బుక్ ప్రింటింగ్ ప్రక్రియ
సుమారు ఆరు నెలలుగా
నిరీక్షిస్తున్న రైతులు
సంక్షేమ పథకాల లబ్ధికి
దూరమవుతున్న రైతులు
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి గతంలో నెల రోజుల వ్యవధిలో పోస్ట్ ద్వారా కొత్త పాస్బుక్ వచ్చేది. కొత్త బుక్ కోసం దరఖాస్తు నమోదు కాగానే సీసీఎల్ఏ నుంచి సమాచారం సంబంధిత ముద్రణ సంస్థకు వెళ్తుంది. అక్కడ ముద్రణ పూర్తి చేసుకుని పోస్టల్ శాఖ ద్వారా రైతుల ఇంటికే పాస్బుక్ వస్తుంది. గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్ట్ కలిగిన ముద్రణ సంస్థలకు బిల్లులు, పోస్టల్ శాఖకు రవాణా చార్జీల బిల్లులు పెండింగ్లో ఉన్న కారణంగా వారంతా కార్యకలాపాలు నిలిపివేసినట్లు సమాచారం. అయితే భూ భారతిలో కొన్ని మార్పులు చేసే క్రమంలో బుక్ ప్రింటింగ్ నిలిపివేసినట్లు అధికారులు చెబుతున్నారు. కారణమేదైనా రైతులకు తిప్పలు తప్పడం లేదు.
మా నాన్న పేరు మీదున్న భూమిని వారసత్వం కింద నా పేరుమీదకు రిజిస్ట్రేషన్ పూర్తయ్యింది. ఆరు నెలలు గడుస్తున్నా పట్టా పాస్పుస్త కం రాలేదు. అధికారులను సంప్రదిస్తే వస్తది అంటున్నారే తప్ప స్పష్టమైన సమాధానం ఇవ్వడం లేదు. – రాకేశ్, రామారెడ్డి
భూమి రిజిస్ట్రేషన్ చేసుకుని కొత్త పాస్పుస్తకం కోసం మీసేవ ద్వారా డబ్బులు చెల్లించాను. 9 నెలలు గడుస్తోంది. ఇప్పటికీ బుక్కు రాలేదు. ప్రభుత్వం స్పందించి కొత్త పట్టా పాస్బుక్కు అందించాలి.
– శివరాం బాలాగౌడ్, రామారెడ్డి
పత్తాలేని పాస్బుక్!
పత్తాలేని పాస్బుక్!


