భర్తను హత్య చేసేందుకు భార్య కుట్ర | - | Sakshi
Sakshi News home page

భర్తను హత్య చేసేందుకు భార్య కుట్ర

Apr 29 2025 8:15 AM | Updated on Apr 29 2025 8:15 AM

భర్తను హత్య చేసేందుకు భార్య కుట్ర

భర్తను హత్య చేసేందుకు భార్య కుట్ర

కామారెడ్డి క్రైం: వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని భర్తను హత్య చేయించేందుకు చేసిన కుట్ర ఫెయిల్‌ అవ్వడంతో నిందితులు కటకటాల పాలయిన ఘటన మాచారెడ్డి మండలంలో వెలుగుచూసింది. ఈ కేసులో మొత్తం ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేయగా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ రాజేశ్‌ చంద్ర వివరాలు వెల్లడించారు. మాచారెడ్డి మండలం ఘన్‌పూర్‌(ఎం) గ్రామానికి చెందిన సాడెం కుమార్‌ మెదక్‌ జిల్లాలోని ఓ మున్సిపాలిటిలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా అల్వాల్‌కు చెందిన కాంపల్లి మహేష్‌ ప్రస్తుతం రాజన్న సిరిసిల్లా జిల్లా తంగళ్లపల్లి వద్ద ఉన్న లలిత మ్మ గుడిలో పూజారిగా పనిచేస్తున్నాడు. కుమార్‌ భార్య రేణుక నాలుగేళ్లుగా మహేష్‌తో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తుంది. ఈక్రమంలో తమ వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్న కుమార్‌ను హతమార్చాలని రేణుక, మహేష్‌లు కుట్ర పన్నారు. ఆ తర్వాత అతని ఉద్యోగాన్ని, ఆస్తిని దక్కించుకోవాలని భావించారు. అల్వాల్‌కు చెందిన మహమ్మద్‌ అశ్వాక్‌తో రూ.15 లక్షలకు సుపారీ మాట్లాడుకున్నారు. అశ్వాక్‌, అతని అనుచరులు ముబిన్‌, అమీర్‌, అన్వర్‌, మోసిన్‌లకు అడ్వాన్సుగా రూ.2లక్షలు ఇచ్చారు. ఈ నెల 21న కుమార్‌ బైక్‌పై వెళ్తుండగా ఫరీద్‌పేట సమీపంలోని సోలార్‌ ప్లాంట్‌ వద్ద దారి కాచిన సుపారీ గ్యాంగ్‌ అతడిని అడ్డుకుని రాడ్లతో దాడి చేశారు. అదే సమయంలో అటుగా కారులో ఓ ఇద్దరు వ్యక్తులు రావడం చూసి అక్కడి నుంచి నిందితులు పరారయ్యారు. వెంటనే కుమార్‌ను స్థానికులు, పోలీసులు కలిసి ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసిన మాచారెడ్డి పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం, సీసీ పుటేజ్‌ల ఆధారంగా నిందితులను గుర్తించారు. వారిని పట్టుకొని విచారించగా నేరం అంగీకరించినట్లు ఎస్పీ తెలిపారు. ప్రధాన నిందితులైన మహేష్‌, రేణుకలతో పాటు సుపారీ గ్యాంగ్‌కు చెందిన అశ్వాక్‌, ముబీన్‌, అమీర్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నామన్నారు. పరారీలో ఉన్న ఇద్దరి నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు. నిందితుల వద్ద నుంచి ఓ కారు, ఆటో, రెండు బైక్‌లు, గొడ్డలి, రాడ్లు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. కేసు ఛేదనలో విశేషంగా కృషి చేసిన రూరల్‌ సీఐ రామన్‌, ఎస్‌ఐ అనిల్‌, సిబ్బందిని అభినందించారు.

ప్రియుడితో కలిసి ఐదుగురికి

రూ.15లక్షల సుపారీ

మొత్తం ఐదుగురు అరెస్టు,

పరారీలో ఇద్దరు

వివరాలు వెల్లడించిన ఎస్పీ రాజేశ్‌చంద్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement