
లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకోవాలి
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వెంటనే ప్రారంభించాలని ఎల్లారెడ్డి డీఎల్పీవో సురేందర్ సూచించారు. నాగిరెడ్డిపేట మండలం అచ్చాయపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో మంగళవారం ఇందిరమ్మ లబ్ధిదారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైలెట్ గ్రామంగా ఎంపికై న అచ్చాయపల్లి గ్రామపంచాయతీ పరిధిలో మొత్తం 90మంది లబ్ధిదారులకు ఇళ్లు మంజూరుకాగా ఇప్పటివరకు కేవలం 13మంది మాత్రమే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించారన్నారు. మిగతా లబ్ధిదారులు ఎందుకు ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించడంలేదని ఆయన ఆరా తీశారు. సమావేశంలో నాగిరెడ్డిపేట ఎంపీడీవో ప్రభాకరచారి, గ్రామపంచాయతీ ప్రత్యేకాధికారి పిచ్చయ్య, పంచాయతీ కార్యదర్శి వెంకటరాములు తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు
అర్హులను గుర్తించాలి
దోమకొండ/ఎల్లారెడ్డిరూరల్/ నిజాంసాగర్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు అర్హులైన పేదలను గుర్తించాలని ఎంపీడీవో ప్రవీణ్కుమార్ అన్నారు. మంగళవారం దోమకొండ మండలం లింగుపల్లి గ్రామంలో లబ్ధిదారుల గుర్తింపుకు అధికారులు ఇంటింటికి తిరిగి గుర్తించారు. గ్రామంలో 12 మంది లబ్ధిదారులను గుర్తించాల్సి ఉండగా, 10 మంది ఇంటి నిర్మాణానికి ముందుకు వచ్చినట్లు ఎంపీడీవో వివరించారు. ఎల్లారెడ్డి మండలం అడివిలింగాల గ్రామంలో ఎంపీవో ప్రకాష్ ఇందిరమ్మ ఇళ్ల సర్వేను నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు చేసుకున్న వారికి సంబంధించిన వారి వివరాలను పరిశీలించారు.నిజాంసాగర్ మండలం మల్లూర్తండా గ్రామ పంచాయతీలో ఇందిరమ్మ ఇళ్ల స్థలాలను ఎంపీడీవో గంగాధర్ పరిశీలించారు. ఇందిరమ్మ గృహాలు మంజూరైన లబ్ధిదారుల ఇళ్ల స్థలాలు, ఇంటి నిర్మాణ పనులపై లబ్ధిదారులతో చర్చించారు. ఈకార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.