
మున్సిపాలిటీ పేరుతో పన్ను వసూలు
బిచ్కుంద(జుక్కల్): బిచ్కుంద మున్సిపాలిటీగా చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో గోపన్పల్లి, దౌల్తాపూర్, కందర్పల్లి గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలో విలీనం చేశారు. ఇదే అదునుగా భావించిన పంచాయతీ అధికారులు పన్ను వసూళ్ల పై ప్రత్యేక దృష్టి సారించారు. మున్సిపాలిటీ అయితే నాలుగైదు రెట్లు అన్ని రకాల పన్నులు పెరిగిపోతాయి. ఇప్పుడు పన్ను కడితే తక్కువ ఖర్చులో చెల్లించవచ్చని జోరుగా ప్రచారం చేస్తున్నారు. అధికారుల పనితీరు చెట్టు పేరుచెప్పి కాయలు అమ్ముకున్నట్లుగా ఉంది. మున్సిపాలిటీ భయంతో ప్రజలు ఇంటి, కుళాయి,వాణిజ్య సముదాయాలు, ట్రెడ్ లైసెన్సులు, ప్లాట్ల నాలా కన్వర్షన్ వివిధ రకాల పన్నులు కట్టడానికి ప్రజలు ముందుకు వస్తున్నారు. దీంతో జీపీలకు పన్ను ఆదాయం పెరుగుతోంది.
గతంలో నిలదీశారు...
ఇంటింటికి వెళ్లి పన్ను కట్టాలని సిబ్బంది అడిగితే తాగునీరు రావడం లేదని, మురికి కాలువలు శుభ్రం చేయడంలేదని, రోడ్డు పై చెత్త అలాగే ఉందని, వీధిలైట్లు వెలగడం లేదని ప్రజలు నిలదీసేవారు. ఇప్పుడు ఏకంగా ప్రజలే జీపీ వెళ్లి పన్ను చెల్లిస్తున్నారు. బిచ్కుంద గ్రామ పంచాయతీకి 97 శాతం రూ.30 లక్షల పైన పన్ను వసూలైంది. దౌల్తాపూర్లో 98 శాతం, కందర్పల్లిలో 95 శాతం, గోపన్పల్లిలో 90 శాతం పన్ను వసూలైందని అధికారులు తెలిపారు. ఏమైనా మున్సిపాలిటీ పేరుతో పన్ను ఆదాయం రెట్టింపు పెరిగింది.
గృహ నిర్మాణాల కోసం దరఖాస్తులు..
బిచ్కుంద, గోపన్పల్లి, కందర్పల్లి, దౌల్తాపూర్ గ్రామ శివారులలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ఎన్నో వెంచర్లు వెలిశాయి. భవిష్యత్తులో మున్సిపాలిటీ అధికారుల నిబంధనలు కఠినంగా ఉంటాయని భావించి, ఓపెన్ ప్లాట్లు ఉన్న వారు గృహ నిర్మాణాల అనుమతి కోసం జీపీలలో దరఖాస్తులు పెట్టుకుంటున్నారు. మున్సిపాలిటీ గెజిట్ రాకముందే నిర్మాణాల అనుమతులు పొందాలని జీపీల చుట్టూ తిరుగుతున్నారు. జీపీ అధికారులు ఎలాంటి షరతులు లేకుండా అనుమతులు ఇవ్వాలని కొందరు రాజకీయ నాయకులతో సిఫార్సు చేయిస్తున్నారు. మరికొందరు అధికారులకు అడిగినకాడికి మట్టు జెప్పుతున్నారని విమర్శలున్నాయి.
జీపీలకు పెరిగిన పన్ను ఆదాయం
బిచ్కుంద మున్సిపాలిటీలో
మూడు గ్రామాలు విలీనం
నాలుగైదు రెట్లు పన్ను
పెరుగుతుందని ప్రచారం

మున్సిపాలిటీ పేరుతో పన్ను వసూలు

మున్సిపాలిటీ పేరుతో పన్ను వసూలు