వేర్వేరు కారణాలతో ఇద్దరి ఆత్మహత్య
ఎల్లారెడ్డిరూరల్: మండలంలోని లక్ష్మాపూర్ గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై మహేష్ తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన బోండ్ల నర్సింలు (35) మద్యానికి బానిసై గురువారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు తెలిపారు.
భిక్కనూరు మండలంలో..
భిక్కనూరు: మండలంలోని పెద్దమల్లారెడ్డి గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన పోచమ్మల నర్సింలు (45) కుటుంబ కలహాలతో విరక్తి చెందాడు. ఈక్రమంలో గురువారం వేకువజామున అతడు తన బంగ్లా పైనుంచి విద్యుత్తు స్తంభం ఎక్కి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడతోఘటనా స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు.
బాలుడి ఆత్మహత్యాయత్నం
రాజంపేట: మండల కేంద్రంలో ఓ బాలుడు ఆత్మహత్యకు యత్నించాడు. గ్రామస్తులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు ఇలా.. రాజంపేటకు చెందిన కడమంచి స్వామి కుమారుడు శ్రీహరి(17) రూ. 30వేల మొబైల్ ఫోన్ కొనివ్వాలని ఇంట్లో గొడవ పడ్డాడు. అంత ఖరీదైన మొబైల్ కొనే స్థోమత లేదంటూ తండ్రి నిరాకరించాడు. దీంతో మనస్థాపానికి గురైన శ్రీహరి గురువారం ఎలుకలు మందు(బిస్కెట్లు) తిన్నాడు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలపడంతో వారు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శ్రీహరి ఆరోగ్యం నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.


