రెవెన్యూకు ఆన్‌లైన్‌ గండి! | - | Sakshi
Sakshi News home page

రెవెన్యూకు ఆన్‌లైన్‌ గండి!

Sep 20 2026 12:09 AM | Updated on Sep 20 2026 12:09 AM

కాకినాడ లీగల్‌: గత మూడు నెలలుగా జిల్లాలో నాన్‌ జ్యుడీషియల్‌, రెవెన్యూ, కోర్టు ఫీ స్టాంపుల కొరత వేధిస్తోంది. స్థానిక జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయం ఆవరణలో ఉన్న జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో స్టాంపులు ఉన్నప్పటికీ వాటి నంబర్లు ఆన్‌లైన్‌లో నమోదు కాకపోవడంతో కక్షిదారులకు విక్రయించే అవకాశం లేకపోతోంది. ఇక్కడ కొరత ఉందని ఇతర సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల నుంచి కొన్నింటిని తీసుకువచ్చినా అవి కూడా స్థానిక సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం నుంచి విక్రయిస్తున్నట్టుగా ఆన్‌లైన్‌లో నమోదు కాకపోవడంతో విక్రయాలు నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది. దీంతో భూములు, ఆస్తుల క్రయవిక్రయాలు, వివిధ ఒప్పందాలు, అఫిడవిట్లు, ఇతర చట్టపరమైన అవసరాలకు స్టాంపులు అవసరమయ్యే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇతర కార్యాలయాల నుంచి తెచ్చినా..

కాకినాడ జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో స్టాంపు పేపర్ల కొరత వల్ల ప్రత్తిపాడు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం నుంచి రూ.100 విలువ గల మూడు వేల నాన్‌ జ్యుడీషియల్‌ స్టాంపులను, తాళ్లరేవు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం నుంచి రూ.10 విలువ గలవి రెండు వేలు, రూ.20 విలువ గలవి ఐదు వేలు నాన్‌ జ్యుడీషియల్‌ స్టాంపులు, రూ.1 విలువైన 64 వేల రెవెన్యూ స్టాంపులను తీసుకువచ్చారు. ఇవీ తీసుకువచ్చి సుమారు మూడు నెలలు గడుస్తున్నా వాటిని ఆన్‌లైన్‌లో నమోదు చేయకపోవడంతో ప్రజలకు విక్రయించలేని పరిస్థితి నెలకొంది.

అనుమతులన్నీ ఐజీ స్థాయిలోనే..

గతంలో ఒక సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం నుంచి మరో కార్యాలయానికి స్టాంపులను తరలించినప్పుడు జిల్లా రిజిస్ట్రార్‌ అనుమతితో వాటిని ఆన్‌లైన్‌లో నమోదు చేసే అవకాశం ఉండేదని ఉద్యోగులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆ అనుమతులు రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ కార్యాలయం నుంచి రావాల్సిన పరిస్థితి నెలకొనడంతో ఈ పరిస్థితి నెలకొంది. జిల్లా స్థాయి అధికారులు ఈ సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్నప్పటికీ రాష్ట్ర ఐజీ కార్యాలయం స్పందించకపోవడంతో ఈ సమస్య ఎదురవుతోందని సిబ్బంది చెప్తున్నారు.

ప్రభుత్వ ఆదాయానికీ నష్టం?

స్టాంపుల విక్రయాల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. అవి అందుబాటులో ఉన్నప్పటికీ సాంకేతికంగా వాటిని విక్రయించే అవకాశం లేకపోవడంతో ప్రత్యక్షంగా, లావాదేవీలు జరగక పరోక్షంగా ప్రభుత్వ ఆదాయానికి గండి పడే అవకాశం ఉందని సిబ్బంది చెప్తున్నారు.

ఉన్నతాధికారులు దృష్టి సారించాలి

జిల్లా ప్రధాన కేంద్రంలో నెలకొన్న ఈ సమస్యపై రాష్ట్రస్థాయిలో ఉన్నతాధికారులు తక్షణం స్పందించి ఆన్‌లైన్‌లో నమోదు చేసేలా ఐజీ కార్యాలయం అధికారులకు ఆదేశాలు ఇవ్వాల్సి ఉంది. అలాగే ఇతర సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల నుంచి సర్దుబాటు నిమిత్తం తీసుకువచ్చే స్టాంపులకు సైతం అనుమతులు జిల్లాస్థాయిలో ఇచ్చుకునేలా శాఖాపరమైన మార్పులు చేయాల్సి ఉందని పలువురు సూచిస్తున్నారు.

స్టాంపులు లేక అవస్థలు

ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సంబంధించి ఉద్యోగుల జాయినింగ్‌కు, వివిధ రకాల ఒప్పంద పత్రాలకు రూ.100 స్టాంపు పేపర్లు ఎంతో అవసరం. అలాగే రూ.10, రూ.20 విలువవైన స్టాంపులు నోటరీ అఫిడవిట్‌ కోసం, దస్తావేజు నకలు కాపీ, కోర్టు నకలు కాపీ దరఖాస్తు చేయడానికి కీలకం. స్టాంపుల ఆన్‌లైన్‌ సమస్యను సత్వరం పరిష్కరించాలి.

– వీరాబత్తుల రాజు, న్యాయవాది, కాకినాడ

నగదు చెల్లింపులకు ఇబ్బంది

రెవెన్యూ స్టాంపులు అందుబాటులో లేకపోవడంతో నగదు లావాదేవీలు జరిగినప్పుడు ఇబ్బంది పడుతున్నాం. అన్ని నగదు లావాదేవీలపై రెవెన్యూ స్టాంపులు తప్పనిసరి. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలి.

– ఎన్‌.నగేష్‌, కాకినాడ

వేధిస్తున్న నాన్‌ జ్యుడీషియల్‌,

రెవెన్యూ స్టాంపుల కొరత

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో

లావాదేవీలకు అవస్థలు

మూడు నెలలుగా

ఇబ్బంది పడుతున్న కక్షిదారులు

ఆన్‌లైన్‌లో నమోదుకు

ఐజీ అనుమతుల కోసం ఎదురుచూపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement