రాజవొమ్మంగి: స్థానిక గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బోయపాడు గ్రామానికి చెందిన కాకూరి దీక్షిత అమరావతిలో త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి క్రీడాపోటీలకు ఎంపికై ంది. ప్రిన్స్పాల్ సత్యవేణి శుక్రవారం విలేకరులకు ఈ విషయం తెలిపారు. ఇటీవల పాడురులో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో అండర్ – 17 విభాగంలో కోకోలో ఆమె ప్రతిభ చూపిందన్నారు. కాగా.. ఆ బాలికను పలువురు అభినందించారు.
సమస్యలపై
రాజీలేని పోరాటం
రామచంద్రపురం రూరల్: రాష్ట్రంలో విద్యార్థులు, యువత ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటాలు చేయాలని పీవైఎల్ మహాసభలో వక్తలు అన్నారు. రామచంద్రపురంలోని చెలికాని రామారావు స్మారక భవనంలో శుక్రవారం నిర్వహించిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా 7వ మహాసభలో పలు తీర్మానాలు చేశారు. నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇవ్వాలని, మద్యం, గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలను నిషేధించాలని, నీట్ పరీక్ష లీకేజీ, అవినీతి, అక్రమాల కారణంగా ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థులకు కుటుంబాలకు రూ. 1 కోటి చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద ఓసీ విద్యార్థుల స్కాలర్షిప్పులు, ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ బకాయిలను తక్షణం విడుదల చేయాలని తదితర తీర్మానాలు చేశారు.
నేటి నుంచి
వనదుర్గమ్మ జాతర
అన్నవరం: రత్నగిరి వనదేవతగా పూజలందుకుంటున్న వనదుర్గమ్మ శ్రావణ మాస జాతర మహోత్సవాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. వీటిని ఈ నెల 28 తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు శనివారం ఉదయం తొమ్మిది గంటలకు వనదుర్గ అమ్మవారి ఆలయంలో పండితులు విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం నిర్వహించి జాతర మహోత్సవాలకు అంకురార్పణ చేస్తారు. నవధాన్యాలతో మండపారాధన, కలశస్థాపన జరుపుతారు. 50 మంది రుత్విక్కులు నవగ్రహ జపాలు, శ్రీచక్రార్చన, మూలమంత్ర జపాలు నిర్వహిస్తారు. జాతరలో భాగంగా అమ్మవారిని తొలిరోజు బాలా త్రిపుర సుందరిగా, 23న సరస్వతిగా, 24న అన్నపూర్ణగా, 25న మహాలక్ష్మిగా, 26న గాయత్రీదేవిగా, 27న వారాహి అమ్మవారిగా, 28న రాజరాజేశ్వరిగా అలంకరించి పూజలు నిర్వహిస్తారు.
తలుపులమ్మకు చండీహోమం
తుని రూరల్: లోవదేవస్థానంలోని తలుపులమ్మ తల్లికి వేదపండితుల, అర్చకులు మహాచండీ హోమం, కుంకుమార్చనలు నిర్వహించారు. శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమాల అనంతరం భక్తులకు దర్శనాలు కల్పించారు.
హత్య కేసులో నిందితుడి అరెస్ట్
శంఖవరం: పి.మల్లాపురం పంచాయతీ శృంగధార గ్రామంలో రాజమ్మంగి మండలం వాతంగి పంచాయతీ ఓకూర్తి గ్రామానికి చెందిన ముర్లా మణికుమార్ను హత్య చేసిన ఘటనలో నిందితుడు కాకూరి చంద్రయ్యను శుక్రవారం అరెస్ట్ చేశారు. ప్రత్తిపాడు సీఐ సూర్య అప్పారావు తెలిపిన వివరాల ప్రకారం.. చంద్రయ్య, భార్య సూర్యావతిలను గతంలో మణికుమార్ నాటు తుపాకీతో కాల్చి గాయపర్చాడు. ఆ కేసులో జైలు శిక్ష అనుభవించి తిరిగి వచ్చాడు. అనంతరం మళ్లీ సూర్యావతిని ఇబ్బంది పెట్టడంతో మణికుమర్కు చంద్రయ్య హత్య చేశాడు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి, త్వరితగతిన విచారణ చేపట్టి, 72 గంటల్లో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు అన్నవరం ఎస్సై శ్రీహరిబాబు తెలిపారు.


