బోట్క్లబ్ (కాకినాడ సిటీ): పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం గోదావరిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడడానికి రైఫిల్ షూటర్ షేక్ సాధిక్ ఖాన్ వేధింపులే కారణమని ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటన సంబంధించి సాధిక్ ఖాన్తో పాటు అతనికి సహకరించిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలన్నారు. ఈ మేరకు ప్రజాసంఘాల నాయకులు గురువారం స్థానిక కలెక్టరేట్లో కలెక్టర్ హరేంధిర్ ప్రసాద్, ఎస్పీ బిందు మాధవ్లను కలసి వినతి పత్రాలను అందజేశారు. ఆత్మహత్య చేసుకునే సమయంలో ఏఈ కుటుంబ సభ్యులను సాధిక్ ఖాన్ వేధించారని, అందుకే బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు సూసైడ్ నోట్లను సౌజన్య రాశారన్నారు. పోలీసులు సమగ్ర విచారణ చేపట్టి అతనికి కఠిన శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు ఏఈ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. సాధిక్ ఖాన్ తమను ఇస్లాం మతంలోకి మారాలని తీవ్రంగా ఒత్తిడి చేయడంతోనే నూకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకున్నట్లు జిల్లా కుమ్మర శాలివాహన సంఘ అధ్యక్షుడు టిల్లపూడి నాగేశ్వరరావు, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ రహీమ్, మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమా, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ డైరెక్టర్ మాలకొండయ్య మండిపడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూకరాజు అల్లుడు జగదీష్రెడ్డికి సాధిక్ ఖాన్ పాయిజన్ ఇచ్చి హత్య చేశాడని సూసైడ్ నోట్లో సౌజన్య రాశారని అన్నారు. దీనిపై సమగ్రంగా విచారణ చేపట్టాలని కోరారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో శాలివాహన సంఘ నాయకులు సత్యనారాయణ, నారాయణరావు, వెంకటరమణ, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఖాన్, కాకినాడ సిటీ అధ్యక్షుడు పైసల్, జిల్లా సెక్రటరీలు కె.అలీఖాన్, ఆన్సర్ తదితరులు పాల్గొన్నారు.


