సామర్లకోట సీహెచ్సీలో
చికిత్స పొందుతున్న బాధితులు
వైద్య బృందానికి పరిస్థితిని వివరిస్తున్న
వైఎస్సార్ సీపీ నాయకులు
సామర్లకోట: ఒక్కొక్కరిగా మంచం పడుతున్నారు.. వివిధ రోగాలతో సతమతమవుతున్నారు.. పచ్చ కామెర్లు, కడుపు నొప్పి, జ్వరం ఇలా వివిధ రుగ్మతలతో సామర్లకోట సీహెచ్సీలో చికిత్స పొందుతున్నారు. పట్టణ ప్రజలకు తాగునీరు సరఫరా చేసే ఫిల్టర్ బెడ్ ప్లాంట్కు చెందిన చెరువులో చేపల వేటకు అనుమతి ఇవ్వడంతో నీరు కలుషితం కావడం వల్లే ఇలా జరుగుతుందని వైఎస్సార్ సీపీ నాయకులు మన్యం చంద్రరావు, కరణం రాజ్కుమార్, పాగా సురేష్కుమార్, నేతల హరిబాబు, సేపెని సురేష్, చిట్టుమాని శ్రీనివాస్, వారా సుధాకర్, కానేటి బుల్లి అప్పారావు, ఇరుసుమళ్ల సాయి, మాగాపు గోపు, లింగం శివకుమార్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక సీహెచ్సీలో పచ్చ కామెర్లతో చికిత్స పొందుతున్న రోగులను వారు పరామర్శించారు. అలాగే విషయం తెలుసుకుని ఆస్పత్రికి మున్సిపల్ కమిషనర్ ఎన్.కనకారావు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన్ని వైఎస్సార్ సీపీ నాయకులు తాగునీటి కలుషితంపై నిలదీశారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని వారు ఆరోపించారు. అనేక మంది ఆస్పత్రిలో చేరితే ఎమ్మెల్యే కనీసం రాకపోవడం వింతగా ఉందన్నారు. సామర్లకోటలో అనేక మంది వివిధ రోగాల బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకుని కాకినాడ డీఎంహెచ్ఓ కార్యాలయానికి చెందిన బృందం సామర్లకోటకు వచ్చింది. డాక్టర్లు ప్రత్యూష, బేబీ, సీహెచ్ శ్రీనివాస్, రామానాయుడులు సీహెచ్సీలో రోగుల నుంచి వివరాలు సేకరించారు. అదేవిధంగా బలుసులపేట, భాస్కర్నగర్కు చెందిన బాధితులు ఎక్కువగా ఉండటంతో ఆయా ప్రాంతాలను డాక్టర్ల బృందం పరిశీలించింది. మున్సిపల్ కుళాయిల నుంచి వస్తున్న నీటిని తాగడం వల్లే రోగాల బారిన పడినట్లు బాధితుల బంధువులు వారికి తెలిపారు చేశారు. తాగునీటి చెరువును చేపల వేటకు అనుమతి ఇవ్వవద్దని ఫిర్యాదులు చేసినా, మున్సిపల్ అధికారులు పట్టించుకోలేదని వైఎస్సార్ సీపీ నాయకులు తెలిపారు. కాలుష్య జలాలు సరఫరా కావడానికి కారణమైన సిబ్బందిని సస్పెండ్ చేయాలని, లేకుంటే ఆమరణ దీక్షలు చేస్తామని హెచ్చరించారు. దీనిపై ఆస్పత్రి ఇన్చార్జి కార్తీక్, డాక్టర్ శివజ్యోతి మాట్లాడుతూ సోమవారం కడుపు నొప్పి, వాంతులతో ఏడుగురు రోగులు చేరారని చెప్పారు. చికిత్స పొందుతున్న వారిలో ఒకరి పరిస్థితి మెరుగుపడటంతో ఇంటికి పంపామన్నారు. రోగాలకు గల కారణాలను తెలుసుకునేందుకు నీటి, ఆహార నమూనాలు సేకరించారని తెలిపారు.
ఫ ఆసుపత్రిలో చేరిన బాధితులు
ఫ కలుషిత నీరే కారణం
ఫ అధికారులను నిలదీసిన
వైఎస్సార్ సీపీ శ్రేణులు


