ముమ్మిడివరం: స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల గర్భిణులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నట్టు సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు జి.దుర్గాప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలోని డాక్టర్ వీవీఎస్ సత్యకుమార్ నిర్లక్ష్యం వల్ల మండలంలోని అనాతవరానికి చెందిన గర్భిణి సకిలే విమల, ఆమె కుటుంబ సభ్యులు ఎదుర్కొన్న సమస్యపై దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో డీఎంహెచ్ఓకు ఫిర్యాదు చేశారు. ఈ నెల మూడో తేదీన విమలను ఆమె కుటుంబ సభ్యులు ప్రసవం కోసం ఆస్పత్రిలో చేర్చగా గైనకాలజిస్టు సత్యకుమార్ కొన్ని పరీక్షలు చేసి నాలుగో తేదీన ఆపరేషన్ చేస్తానని పంపేశారు. కాగా ఆ రోజు విమలను ఆపరేషన్ థియేటర్లోనికి తీసుకువెళ్లి 4 గంటల అనంతరం వచ్చి ఆమెకు ఆపరేషన్ చేయడం లేదని, మరికొన్ని పరీక్షలు చేయాలని, తల్లి, లేదా బిడ్డ ఎవరో ఒకరే బతికే అవకాశం ఉందని తమను తీవ్ర ఆందోళనకు గురిచేశారని ఆమె కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. చివరకు వైద్యానికి కాకినాడ తీసుకువెళ్లాలని చెప్పడంతో అంబులెన్స్ సిద్ధం చేశామని, అంతలోనే తానే ఆపరేషన్ చేస్తానని సత్యకుమార్ వారిని ఆపేశారు. దీంతో ఆయనపై అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు ఆమెను స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చగా సాధారణ ప్రసవమై, తల్లీ బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని వారు తెలిపారు. దీనిపై ఆందోళనకు దిగిన విమల కుటుంబ సభ్యులు, సీఐటీయూ నాయకులతో ఆసుపత్రి సూపరింటెండెంట్తో చర్చలు జరిపారు. నిర్లక్ష్యంగా వ్యవహిరించిన డాక్టర్ సత్యకుమార్పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని భవిష్యత్లో ఇటువంటి ఘటనలు జరగకుండా చూడాలని వారు డిమాండ్ చేశారు.
అపరేషన్ చేస్తానని..
లేదు లేదు కాకినాడ తీసుకువెళ్లాలని..
వద్దులెండి నేనే చేస్తాను ఆగండని..
తల్లీ బిడ్డల్లో ఒకరే బతుకుతారని..
మానసిక వేదనకు గురిచేసిన
ప్రభుత్వ ప్రసూతి వైద్యుడు
చివరకు ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం
సాధారణ ప్రసవంతో తల్లీ బిడ్డా క్షేమం
ప్రభుత్వ వైద్యునిపై డీఎంహెచ్ఓకు ఫిర్యాదు


