బోట్క్లబ్ (కాకినాడ సిటీ): అంగన్వాడీలు, ఆశ కార్యకర్తలు, వీఓఏలు, మధ్యాహ్న భోజనం పథకం సిబ్బందికి కనీస వేతనం కింద రూ. 26 వేలు చెల్లించాలని సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు జి.బేబీరాణి డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం స్థానిక కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. స్మార్ట్ కిచెన్ల పేరుతో మధ్యాహ్న భోజన పథకం కార్మికులను తొలగించే పనిని ప్రభుత్వం మానుకోవాలని బేబీరాణి అన్నారు. రకరకాల యాప్లతో అంగన్వాడీ, ఆశాలు, వీఓఏలతో సంబంధం లేని పనులను చేయిస్తున్నారన్నారు. తక్షణం పెంచిన పనిభారాన్ని తగ్గించాలని కోరారు. గౌరవ వేతనం పేరుతో ప్రభుత్వమే నేరుగా శ్రామిక మహిళల కష్టాన్ని దోచుకోవడం ఆపాలన్నారు. పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాడ్యుటీ వంటి కనీస చట్టాలను అమలు చేయాలని అన్నారు. వేతనాలను పెంచే వరకు ఐక్య పోరాటాలు చేస్తామన్నారు. అంగర్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రావతి, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమళ్ల పద్మ, యానిమేటర్ల సంఘం జిల్లా కోశాధికారి మేరీ పాల్గొన్నారు.


