బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలో వచ్చే నెల 5 నుంచి 21వ వరకూ ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్షలను సమర్థంగా నిర్వహించాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. గురువారం కాకినాడ కలెక్టరేట్లో పరీక్షల నిర్వహణ, సన్నద్ధతపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయ అర్హత పరీక్షకు 10,620 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని, కంప్యూటర్ బేస్డ్ పరీక్షలు రాసేందుకు 5 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. కాకినాడ అచ్యుతాపురం రైల్వే గేటు సమీపంలోని ఐయాన్ డిజిటల్స్, రాయుడుపాలెం జంక్షన్లోని సాఫ్ట్ టెక్నాలజీలో, సూరంపాలెం ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాలలోని మూడు సెంటర్లలో ఈ పరీక్షలు జరుగుతాయన్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 2.30 నుంచి 5 గంటల వరకు పరీక్షలు ఉంటాయన్నారు. మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రంలోకి అనుమతి లేదన్నారు.


