పిఠాపురం రూరల్: ఇటీవల గొల్లప్రోలుకు చెందిన ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగిని ప్రిస్కిల్లా మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, దీనిని ఆత్మహత్యగా కాకుండా హత్య కోణంలో దర్యాప్తు చేయాలని అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఐహెచ్ఆర్సీ) ప్రతినిధి కె.రాజునందన్ విజ్ఞాన్ డిమాండ్ చేశారు. గురువారం స్థానిక ప్రభుత్వాసుపత్రి వద్ద ఆ కుటుంబ సభ్యులతో కలసి మీడియాతో మాట్లాడారు. ప్రిస్కిల్లా తన సహోద్యోగితో ఐదారేళ్లుగా ప్రేమలో ఉందని, ఆ యువకుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి చివరికి నిరాకరించడంతో పాటు వేధింపులకు గురిచేశాడని ఆరోపించారు. యువతి మృతిలో అనేక అనుమానాస్పద అంశాలు ఉన్నాయని, దీనిని సాధారణ ఆత్మహత్యగా పరిగణించకుండా అన్ని కోణాల్లో విచారణ చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. మృతురాలి తల్లి కౌసల్య మాట్లాడుతూ ప్రేమ పేరుతో తన కుమార్తెను మానసికంగా తీవ్రంగా వేధించాడని, పెళ్లి చేసుకోనని, చనిపోవాలని పదేపదే బెదిరించేవాడని కన్నీరు మున్నీరయ్యారు. తాను వచ్చి మాట్లాడేలోపే కుమార్తె ప్రాణాలు కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.


