రాజమహేంద్రవరం సిటీ: దశాబ్దాల తరబడి జీవితాన్ని విధులకు అర్పించిన ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల వృద్ధాప్య జీవితం అగమ్యగోచరంగా తయారైందని ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ)లో 34–38 ఏళ్ల పాటు తమ ఉద్యోగ జీవితంలో అహర్నిశలు శ్రమించి పని చేసిన తమకు మందుల కొనుగోలుకు సైతం సరిపోని పెన్షన్ ఇస్తున్నారని దీని వలన జీవితం దుర్భరంగా మారిందని ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర మనోవేదన చెందుతున్నారు. 2014కు పూర్వం ఏపీఎస్ఆర్టీసీలో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన వారికి ఈపీఎఫ్ఓ ద్వారా రూ.వెయ్యి పెన్షన్ వచ్చేది. 2014 తర్వాత ఉద్యోగ విరమణ చేసిన వారికి రూ.వెయ్యి నుంచి మూడు వేలు పెన్షన్ మాత్రమే వచ్చే అవకాశం ఉందని ఈ విధమైన పెన్షన్తో ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ సామాజిక పింఛన్కు అనర్హులే..
తాము ఏపీఎస్ఆర్టీసీ సంస్థలో ఉద్యోగులుగా చేయడం వల్ల ఉద్యోగ విరమణ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అందించే ఎన్టీఆర్ సామాజిక భద్రత పింఛన్ సైతం పొందేందుకు అనర్హులమయ్యామని వారు ఆవేదన చెందుతున్నారు. పెరిగిన నిత్యావసరాల ధరలు, ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో వృద్ధాప్యంలో జీవితాన్ని కొనసాగించాలంటేనే ఇబ్బందిగా ఉందని వాపోతున్నారు. ఈపీఎఫ్ఓ కార్యాలయం ఎదుట ఎన్నిసార్లు నిరసనలు చేపట్టినా ఏ విధమైన చర్యలు కనిపించడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి ప్రతి రిటైర్డ్ ఉద్యోగికి మినిమం పెన్షన్ రూ.9000 పెంచడంతో పాటు, రెండు డీఏలు ప్రకటించి రిటైర్డ్ ఉద్యోగి కుటుంబానికి వైద్య సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో..
జిల్లా పింఛన్దారులు
కాకినాడ 615
తూర్పుగోదావరి 365
డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ 380
మొత్తం 1360
ప్రభుత్వ పింఛన్ కన్నా తక్కువ పింఛన్
సంస్థ, ప్రభుత్వం నుంచి
రిటైర్డ్ ఉద్యోగులకు నిరాదరణ
రాష్ట్ర వ్యాప్తంగా
27 వేల మంది పెన్షన్దారులు


