● ఇన్చార్జిల నియామకంలో
అసమ్మతి సెగలు
● కీలక నియోజకవర్గాలపై
అధిష్టానం దృష్టి
● జెండాలు మోసినవారిని
జోకొడుతున్న వైనం
● రాజానగరంలో
చౌదరి మార్పు అనివార్యం
సాక్షి, కాకినాడ: టీడీపీలో నియోజకవర్గ ఇన్చార్జిల నియామకం వర్గ విభేదాలకు ఆజ్యం పోస్తోందా..? చినబాబు అనుకూల వర్గానికి పట్టం కట్టేందుకు రంగం సిద్ధమైందా..? ఈ పరిణామం స్థానిక నేతల్లో అగ్గిరాజేస్తోందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఇంతకీ విషయమేమిటంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జిల నియామకంపై ఆ పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. పి.గన్నవరం, రాజానగరం, నిడదవోలు, కొవ్వూరు, పిఠాపురం నియోజకవర్గాలకు కొత్త ఇన్చార్జిల జాబితా ఇప్పటికే అధిష్టానానికి చేరినట్టు సమాచారం. నామినేటెడ్ పదవుల భర్తీ లాగే నియోజకవర్గ ఇన్చార్జిల నియామకాల్లోనూ చినబాబు ఆశీస్సులు ఉన్నవారికే పట్టం కట్టనున్నట్టు తెలియడంతో పార్టీ కోసం శ్రమించిన వారిలో ఆగ్రహాలు వెల్లువెత్తుతున్నాయి.
పెందుర్తి అన్నపూర్ణకు చాన్స్?
రాజానగరం టీడీపీలో ఉనికి కోసం పాట్లు మొదలయ్యాయి. ఇక్కడి ఇన్చార్జిగా పెందుర్తి వెంకటేష్ తరువాత బొడ్డు వెంకటరమణ చౌదరికి అవకాశం కల్పించగా ఆయనే నేటికీ కొనసాగుతున్నారు. ఆయనకు రుడా చైర్మన్, టీడీపీ జిల్లా అధ్యక్ష పదవులు ఉండడంతో ఇన్చార్జి మార్పు అనివార్యమైంది. అలాగే ఆయన పెద్దాపురం నియోజకవర్గానికి చెందినవారు కావడంతో స్థానిక నేతనే ఇన్చార్జిగా నియమించాలని యోచనలో ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రోగ్రాం కన్వీనర్ పెందుర్తి వెంకటేష్ భార్య
పెందుర్తి అన్నపూర్ణ వైపు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం.
జనసేనకు ఝలక్..?
ఈ పరిణామాల నేపథ్యంలో బొడ్డు వెంకటరమణ చౌదరి తనను ఇన్చార్జి పదవి నుంచి తొలగిస్తే రుడా చైర్మన్గా మరికొన్నేళ్లు కొనసాగించాలని కోరినట్టు, అందుకు అధిష్టానం ఓకే చేసినట్టు తెలిసింది. ఈ పరిణామం రాజమహేంద్రవరం సిటీ నేతల్లో ఆగ్రహావేశాలు నింపుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి సర్దుబాట్లలో భాగంగా సిటీ ఎమ్మెల్యే స్థానాన్ని జనసేన నేత అత్తి సత్యనారాయణ త్యాగం చేయడం, అందుకు బదులుగా రాజమహేంద్రవరం మేయర్ ఇస్తామని హామీ ఇవ్వడం తెలిసిందే. తాజాగా ఇప్పట్లో కార్పొరేషన్ ఎన్నికలకు అవకాశం లేకపోవడంతో రుడా చైర్మన్ పదవిని జనసేన డిమాండ్ చేస్తోంది. ఇది ఆ రెండు పార్టీల మధ్యా అగ్గి రాజేస్తోంది.
కొవ్వూరులో కయ్యాలు..
కొవ్వూరులో ఎమ్మెల్యేగా ముప్పిడి వెంకటేశ్వరరావు ఉన్నా ద్విసభ్య కమిటీ నియోజకవర్గ బాధ్యతలు చూస్తోంది. ఆ కమిటీ పెత్తనాన్ని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నట్టు తెలుస్తోంది. ఆ కమిటీని తొలగించి ఎమ్మెల్యేకు పూర్తి బాధ్యతలు ఇవ్వాలని శ్రేణులు కోరుతున్నట్టు సమచారం. కొందరు మాత్రం కమిటీ వైపే మొగ్గు చూపుతున్నారు.
నిడదవోలుపై నజర్
నిడదవోలు ఇన్చార్జ్గా స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు వ్యవహరిస్తున్నారు. మళ్లీ ఆయనకే నియోజకవర్గ బాధ్యతలు ఇస్తారని తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన కేవలం పార్టీ కార్యక్రమాలకే పరిమితమవుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఆయనను తప్పిస్తారన్న ప్రచారం నడిచినా మళ్లీ ఆయననే నియమించనున్నట్టు తెలుస్తోంది. పొత్తులో భాగంగా ఎమ్మెల్యే స్థానాన్ని వదులుకున్న ఆయనను నియమించకుంటే పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతుందనే ఆలోచనలో అధిష్టానం ఉ్నట్టు తెలుస్తోంది. ఈ నియామకాలన్నీ చంద్రబాబు ఆమోదముద్ర పడ్డాక వెలువడే అవకాశం ఉందని సమాచారం.
పిఠాపురంలో తేలని పరిస్థితి
పొత్తులో భాగంగా టీడీపీ ఎమ్మెల్యే స్థానాన్ని కోల్పోయిన వర్మ తదనంతర పరిణామాల్లో జనసేన నేతలతో వర్గ విభేదాలు ఏర్పడి నియోజకవర్గ ఇన్చార్జి పదవిని సైతం వదులుకోవలసి వచ్చింది. ఆ స్థానం పరిస్థితి ఏంటో తెలియాల్సి ఉంది.
పి.గన్నవరం.. గరంగరం!
ఈ నియోజకవర్గంలో స్థానికుడికే ఇన్చార్జి పదవి ఇవ్వాలని టీడీపీ క్యాడర్ డిమాండ్ చేస్తోంది. కానీ ఇక్కడ ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ను నియమిస్తా రన్న ప్రచారం సాగుతోంది.
కానీ ఆయన ముమ్మిడివరం నియోజకవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఇక్కడి క్యాడర్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అలాగే ఇది ఎస్సీ రిజర్వుడు కావడంతో ఆ వర్గం వారినే నియమించాలని వారు కోరుతున్నా రు. కాగా సివిల్ సప్లైస్ డైరెక్టర్ అనంద్ సాగర్ ఈ స్థానం రేసులో ఉండగా ఆయననూ స్థానిక నేతలు వ్యతిరేకిస్తున్నట్లు తెలిసింది.


