● నెట్వర్క్ సమస్యలతో నిత్యం సతమతం
● పడిగాపులు కాస్తున్న క్రయవిక్రయదారులు
కాకినాడ లీగల్: ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం సమకూరుస్తున్న శాఖల్లో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఒకటి. ఆదాయం భారీగా వస్తున్నప్పటికీ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నిత్యం ఎదురవుతున్న సాంకేతిక సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. శుక్రవారం సాయంత్రం 4.30 గంటల నుంచి 5.30 గంటల వరకూ నెట్వర్క్ పూర్తిగా నిలిచిపోవడంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ స్తంభించింది. దీంతో, క్రయవిక్రయదారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. మరోవైపు విపరీతమైన ఉక్కపోతతో సతమతమయ్యారు. గురువారం ఆస్తి రిజిస్ట్రేషన్ల కోసం చెల్లించిన చలానాలు సిస్టమ్లో నమోదు కాకపోవడంతో కొంత ఇబ్బంది ఎదురైంది. జిల్లాలోని పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇన్వర్టర్లు, కంప్యూటర్లు, స్కానర్లు, ప్రింటర్లు తరచూ పని చేయకపోవడం కూడా సమస్యను మరింత తీవ్రం చేస్తోంది. సాంకేతిక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని క్రయవిక్రయదారులు కోరుతున్నారు.


