తుని రూరల్: రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి అదృశ్యమైన ప్రాంతాన్ని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ గురువారం పరిశీలించి, తల్లిదండ్రులను ఓదార్చారు. సీహెచ్ అగ్రహారం గ్రామానికి గురువారం వచ్చిన ఆయన చిన్నారి తల్లిదండ్రులు సుంకర భవాని, గణేష్లను పరామర్శించారు. జ్ఞానేశ్వరి జాడ తెలుసుకునేందుకు కొండ ప్రాంతాలపై అవగాహన ఉన్న వ్యక్తులతో మరోసారి వెతికిస్తామని చెప్పారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం జ్ఞానేశ్వరి చివరిసారి కనిపించిన ప్రాంతాన్ని, ఆయిల్పామ్ తోటకు, అటవీ ప్రాంతానికి మధ్య రక్షణగా ఏర్పాటు చేసిన ఇనుప కంచెను కలెక్టర్ పరిశీలించారు. దర్యాప్తు పురోగతిపై రూరల్ సీఐ జి.చెన్నకేశవరావు, ఎస్సై బి.కృష్ణమాచారిలను అడిగి తెలుసుకున్నారు. తహసీల్దార్ జీవీఎస్ ప్రసాద్, ఎంపీడీఓ సీహెచ్ రవికుమార్వర్మ కలెక్టర్ వెంట ఉన్నారు.
మెప్మా డీపీఎంగా శైలజ
కాకినాడ లీగల్: మెప్మా జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ (డీపీఎం)గా కె.శైలజ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఆమెను అధికారులు, సిబ్బంది మర్యాద పూర్వకంగా కలసి, పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శైలజ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ను, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ను, జిల్లా రెవెన్యూ అధికారి తిప్పేనాయక్లను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఇన్చార్జి వ్యవసాయ
అధికారిగా రాబర్ట్ పాల్
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లా ఇన్చార్జి వ్యవసాయ అధికారిగా ఆత్మ పీడీ కె.రాబర్ట్ పాల్ను నియమించారు. ఈ మేరకు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకూ జిల్లా వ్యవసాయ అధికారిగా పని చేసిన ఎన్.విజయ్ కుమార్ గత నెల 30న ఉద్యోగ విరమణ చేశారు. ఆయన స్థానంలో పాల్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ఆయన గురువారం బాధ్యతలు స్వీకరించారు.
అమ్మవారి ఆలయంలోకి
గోదావరి
దేవీపట్నం: ఎగువ నుంచి పోటెత్తుతున్న వరద కారణంగా దేవీపట్నం వద్ద గోదావరి నీటిమట్టం పెరిగింది. వరద నీరు గండిపోశమ్మ ఆలయంలోకి, సమీప దుకాణాల్లోకి చేరింది. దండంగి, డి.రావిలంక గ్రామాల మధ్య రహదారిపై భారీగా వరద నీరు పోటెత్తుతోంది. దండంగి వాగులోకి గోదావరి బ్యాక్ వాటర్ పోటెత్తడంతో చినరమణయ్యపేట, దండంగి గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గండిపోశమ్మ ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు దేవదాయ, ధర్మాదాయ శాఖ అధికారులు ప్రకటించారు. ఆలయానికి భక్తులు రావద్దని విజ్ఞప్తి చేశారు. పోశమ్మ గండికి వెళ్లే మార్గాలన్నీ మూతపడ్డాయి. తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం పురుషోత్తపట్నం నుంచి వచ్చే రహదారిని పోలవరం ప్రాజెక్టు అధికారులు ఇప్పటికే మూసివేశారు.


