సాక్షి, అమలాపురం: వరదల సీజన్ రానే వచ్చింది.. వెంటే గుబులు తెచ్చింది.. అనుకోని ఘటన ఎదురైతే, ఎదుర్కొనేందుకు మాత్రం ప్రభుత్వ సన్నద్ధత కానరాకుంది.. వరద నియంత్రణకు ఏర్పాటైన ఫ్లడ్ స్టోర్స్ను చూస్తే, అది ఇట్టే అర్థమవుతోంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం ఐదు సెంట్రల్ ఫ్లడ్ స్టోర్స్, 15 శాశ్వత, 14 అదనపు ఫ్లడ్ స్టోర్స్ ఉన్నట్లు రికార్డుల్లో ఉంది. ఏటిగట్లకు గండ్లు పడినా, ప్రమాదకర పరిస్థితులు తలెత్తినా తక్షణం స్పందించి, తగిన రక్షణ చర్యలు చేపట్టేందుకు ఇవి ఎంతో కీలకం. ఇక్కడ వరద నియంత్రణ సామగ్రి పూర్తిగా సిద్ధంగా ఉందని అధికారులు చెబుతున్నా, వాస్తవంగా ఉండాల్సిన స్థాయిలో ఖాళీ సిమెంట్ సంచులు, వెదురు బొంగులు, సర్వే బాదులు, టార్చిలైట్లు లేవు. చాలా ఫ్లడ్ స్టోర్స్ భవనాలు శిథిలావస్థకు చేరాయి. ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో, జనం భయం గుప్పెట్లో జీవనం సాగించాల్సిన పరిస్థితి దాపురించింది. అయినా చంద్రబాబు ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
ఎందు‘కూలే’ అన్నట్టు..
పి.గన్నవరంలో వైనతేయ నది ఎడమ గట్టుపై ఉన్న పి.గన్నవరం శాశ్వత ఫ్లడ్ స్టోర్ భవనం బీటలు వారి, కూలేందుకు సిద్ధంగా ఉంది. గన్నవరం అక్విడెక్టు నుంచి నాగుల్లంక వరకు ఏటిగట్టు నిర్మించలేదు. వరద వస్తే ఈ ప్రాంతం మునిగిపోతోంది. పాత అక్విడెక్టు పైనుంచి వరద పారుతోంది. ఇంతటి ప్రమాదకరమైన ప్రాంతంలో ఫ్లడ్ స్టోర్ దుస్థితి ఇలా ఉంది.
పక్కా భవనం లేక..
గౌతమీ నది కుడిగట్టుపై ఉన్న కోటిపల్లి సెంట్రల్ ఫ్లడ్ బ్యాంకు వద్ద సర్వే బాదులు, వెదురు కర్రలు ఉన్నాయి. అయితే, ఖాళీ సిమెంట్ సంచులు మాత్రం కనిపించడం లేదు. పక్కా భవనం లేకపోవడంతో రేకుల షెడ్తోనే అనేక ఏళ్లుగా నెట్టుకొస్తున్నారు. అత్యంత కీలకమైన ఈ ప్రాంతంలో పక్కా భవనం లేకపోవడం గమనార్హం.
ఎందుకూ కొరగాని ఫ్లడ్ స్టోర్స్
పూర్తి స్థాయిలో కానరాని సామగ్రి
కనీసం నిర్వహణను వదిలేసిన ప్రభుత్వం
గోదావరి వరదల సీజన్
వచ్చినా నిర్లక్ష్యమే


