
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
న్యాయం చేయాలంటూ ఆందోళన
కపిలేశ్వరపురం (మండపేట): మండపేట పట్టణం కేపీ రోడ్డులో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన స్వర్ణకారుడు మాదాబత్తుల సత్తిబాబు (40) కుటుంబానికి న్యాయం చేయాలంటూ శుక్రవారం కుటుంబ సభ్యులు, సహచర స్వర్ణకార వృత్తిదారులు ఆందోళన చేశారు. మండపేట టిడ్కో గృహ సముదాయం వద్ద నివాసం ఉంటున్న సత్తిబాబు పట్టణంలోని రథం సెంటర్లోని స్వర్ణకార దుకాణంలో వెండి పట్టీల తయారీ పని చేస్తున్నాడు. గురువారం రాత్రి పని ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా మోటారు సైకిల్ ఢీకొట్టింది. కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతూ శుక్రవారం సత్తిబాబు మృతి చెందాడు. కాగా సత్తిబాబు కుటుంబానికి న్యాయం చేయాలంటూ స్వర్ణకారులు, వెండి పనివార్లు కలువ పువ్వు సెంటర్లో మృతదేహంతో ఆందోళన చేపట్టారు. బంగారు వర్తకుల సంఘం అధ్యక్షుడు సంకా శ్రీనివాస్ రంగా, స్వర్ణకారుల సంఘం అధ్యక్షుడు వెదురుపర్తి రామకృష్ణ ప్రసాద్, కామాక్షి వెండి పనివార్ల సంఘం అధ్యక్షుడు అడపా వాసు, వైఎస్సార్ సీపీ నాయకులు కొమ్ము రాంబాబు, పతివాడ రమణ మాట్లాడుతూ మృతికి కారకుడైన వారిపై చట్టపరిధిలో చర్యలు తీసుకోవాలని, కుటుంబాన్ని ఆదుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఆందోళనకు మున్సిపల్ చైర్పర్సన్ పతివాడ నూక దుర్గారాణి సంఘీభావం తెలిపారు. ఆందోళనకారులతో పట్టణ సీఐ సురేష్ మాట్లాడారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.