గద్వాల వ్యవసాయం: మత్స్యకారులకు ఊరట లభించింది. ఎగువన కురిసిన భారీ వర్షాలతో జిల్లాలోని ప్రధాన జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. దీంతో చేపల సీడ్ను వదలాలని మూడు రోజుల క్రితం జిల్లా మత్స్యశాఖ అధికారులకు ఆదేశాలు అందాయి. దీంతో ఈ ఏడాది (2026– 27) చేపపిల్లల పంపిణీ ఉంటుందా.. ఉండదా.. అన్న అనుమానాలకు తెరపడింది. ఇందుకు అవసరమైన టెండర్ ప్రక్రియ సైతం ఆరంభించారు. పదిరోజుల్లో టెండర్ ప్రక్రియను పూర్తిచేసి.. ఈ నెల మూడో వారంలోగా జలాశయాల్లో చేపల పిల్లల సీడ్ వదిలేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో 1.60 కోట్ల నుంచి 2 కోట్ల వరకు జలాశయాల్లో సీడ్ను వదిలే అవకాశం ఉంది.
జిల్లాలో నీటి వనరులు..
జోగుళాంబ గద్వాల జిల్లాలో 96 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉండగా.. ఇందులో 7,300 మంది మత్స్యకారులు ఉన్నారు. వీరుకాక మరో 3 వేల మంది దాక వృత్తిదారులు ఉన్నారు. ఈ కుటుంబాలకు చేపలు, రొయ్యల పెంపకం, విక్రయించడమే జీవనాధారం. జిల్లాలో తుంగభద్ర, కృష్ణానదులతోపాటు జూరాల ప్రాజెక్ట్, శ్రీశైలం బ్యాక్వాటర్, ఆరు రిజర్వాయర్లు, 36 నోటిఫైడ్ చెరువులు మొదలుకొని 396 చిన్న చెరువులు, కుంటలు ఉన్నాయి. వీటిలో ఏటా మత్స్యశాఖ అందించే చేపల, రొయ్యల సీడ్ను వదిలి పెంచుతున్నారు. వీటిని పెంచి విక్రయించి వేలాది మత్స్యకారుల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి.
జలాశయాల్లోకి నీరు..
ఈసారి ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొని.. కొద్దిరోజుల కిందటి వరకు జలాశయాలు వెలవెలబోయాయి. అయితే ఎగువన కురిసిన భారీ వర్షాలతో కృష్ణానదికి వరదలు పోటెత్తి.. ప్రధాన జలాశయం జూరాలకు భారీగా వరదనీరు చేరింది. ఇక్కడి నుంచి నెట్టెంపాడు ఎత్తిపోతలకు దానికి అనుబంధంగా ఉన్న రిజర్వాయర్లకు నీటిని పంపింగ్ చేస్తుండటంతో జలాశయాలు జలకళ సంతరించుకున్నాయి. వీటితోపాటు నోటిఫైడ్ చెరువులకు సైతం నీరు చేరనుంది. ఎట్టకేలకు జలాశయాల్లోకి నీరు చేరుతుండటంతో ఈ ఏడాది చేపల సీడ్ను వదిలేందుకు అవసరమైన కసరత్తు ఆరంభించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు అందాయి. దీంతో అధికారులు టెండర్ ప్రక్రియ ఆరంభించారు. 35 ఎంఎం నుంచి 40 ఎంఎం సీడ్, 80 ఎంఎం నుంచి 100 ఎంఎం సీడ్కు ధరలు నిర్ణయించి, టెండర్ షెడ్యూల్ను రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టి నాణ్యమైన సీడ్ పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
గడిచిన తొమ్మిదేళ్లలో వదిలిన చేపల సీడ్ వివరాలు (కోట్లలో)
ఈసారి సకాలంలో టెండర్ల ప్రక్రియ షురూ
మూడోవారంలో చేప పిల్లల
పంపిణీకి ప్రయత్నాలు
జిల్లాలో 1.60 కోట్ల నుంచి 2 కోట్ల మేర చేపపిల్లలు వదిలే అవకాశం
సుమారు 10 వేల కుటుంబాలకు జీవనోపాధి
నాణ్యమైనవి పంపిణీ చేయాలని వేడుకోలు
2017– 18
1.01
2019– 20
1.02
2018– 19
0.59
2020– 21
1.15
2022– 23
1.69
2021– 22
1.50
2023– 24
1.78
2024– 25
1.30
2025– 26
1.50
2026– 27
?


