● ప్రతి బాధితుడికి
న్యాయం జరిగేలా పనిచేయాలి
● డీఐజీ ఎల్ఎస్ చౌహాన్
రాజోళి: ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించడంలో అత్యాధునిక సాంకేతిక పరి జ్ఞానం కీలక పాత్ర పోషిస్తుందని.. పోలీసు సిబ్బంది పూర్తి అవగాహనతో ముందుకుసాగాలని జోగుళాంబ జోన్ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ సూచించారు. గురువారం శాంతినగర్ పోలీస్స్టేషన్లో ఆయన తనిఖీలు చేపట్టారు. ముందుగా డీఐజీకి ఎస్పీ శ్రీనివాసరావు, సీఐ శంకర్, ఎస్ఐ నాగశేఖర్రెడ్డి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. పోలీసు సి బ్బంది గౌరవ వందనం సమర్పించారు. అనంత రం ఆయన స్టేషన్లో పలు రికార్డులను పరిశీలించడంతో పాటు పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ.. స్టేషన్కు వచ్చే ప్రతి బాధితుడికి న్యాయం జరిగేలా ప్రతి పోలీసు అధికారి తన కర్తవ్యం నిర్వర్తించాలని సూచించారు. పరిశుభ్రమైన వాతావరణంతో కూడిన పరిసరాలు ఉండాలన్నారు. రిసెప్షన్ విధానంలో మార్పులతో కూడుకున్న పనితీరు ఉండాలని.. ఆస్తి సంబంధిత నేరాలు జరిగే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారించాలని ఆదేశించారు. రౌడీ షీటర్లపై నిఘా ఉంచాలన్నారు. డయల్ 112కు వచ్చే ఫిర్యాదులపై సత్వర స్పందన ఉండాలని.. బ్లూ కోల్ట్స్ పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. రోడ్డు భద్రత, సైబర్ నేరాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆయన సూచించారు.


