గద్వాల: గద్వాల మున్సిపాలిటీ పరిధిలోని ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్లోని 38 షాపుల వేలంలో అక్రమాలు చోటుచేసుకున్నా యని బీఆర్ఎస్ పార్టీకి చెందిన 9 మంది కౌన్సిలర్లు హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడారు. వేలం నిర్వహించడానికి మే 15న విడుదల చేసిన నోటిఫికేషన్కు ముందు ఎలాంటి మున్సిపల్ కౌన్సిల్ అనుమతి, తీర్మానం తీసుకోలేదని, రెగ్యులేషన్ ఆఫ్ రిసిప్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్ రూల్స్1986లోని తప్పనిసరి నిబంధనలను పాటించకుండా వేలం నిర్వహించారన్నారు. అలాగే వేలం తేదీలను పలుమార్లు మార్చినా ప్రజలకు తగిన సమాచారం ఇవ్వలేదని, అర్హతల పరిశీలనలో పారదర్శకత పాటించలేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో మే 18న టెండర్ నోటిఫికేషన్, జూన్ 20న నిర్వహించిన వేలం వాటి ఆధారంగా జరిగిన అన్ని తదుపరి చర్యలు కేటాయింపులు, లీజు ఒప్పందాలను రద్దుచేసి మున్సిపల్ కౌన్సిల్ ఆమోదంతో చట్టబద్ధంగా విస్తృత ప్రచారం అనంతరం కొత్తగా వేలం నిర్వహించాలని పిటిషనర్లు హైకోర్టును కోరినట్లు తెలిపారు. ఈ రిట్ పిటిషన్ను పరిశీలించిన హైకోర్టు మున్సిపల్ కమిషనర్కు నోటీసులు జారీ చేసి ఆరోపణలపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.


