ఇక పంచాయితీనే..!
పాత రిజర్వేషన్లతోనే సం‘గ్రామం’
● మంత్రివర్గం నిర్ణయంతోఆశావహుల పోరు సన్నాహాలు
● బీసీలకు పార్టీపరంగా 42% రిజర్వేషన్తో ‘హస్తం’ ముందుకు..
● అదే బాటలోనే కారు, కమలం నడిచే అవకాశం
● ఈ లెక్కన జనరల్ స్థానాల్లో
ఎక్కువ శాతం బీసీలకే చాన్స్
● చట్టపరంగా కాకపోవడంతో
చిక్కులు తప్పవని నేతల బెంబేలు
అన్ని పార్టీల్లోనూ గుబులు..
పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయించిన పక్షంలో చిక్కులు వచ్చే అవకాశం ఉన్నట్లు అన్ని ప్రధాన పార్టీల్లో చర్చ జరుగుతోంది. చట్టపరంగా జనరల్/అన్ రిజర్వ్డ్గా కేటాయించిన స్థానంలో ఆ కేటగిరికి సంబంధించి బలమైన నాయకుడు ఉండడం.. పార్టీ పరంగా ఆ సీటును బీసీలకు ఇవ్వాల్సి వచ్చిన పక్షంలో విభేదాలు పొడచూపే అవకాశం ఉంటుంది. పెద్ద, చిన్న పంచాయతీలు అనేది లేకుండా అంతటా ఈ సమస్య ఉత్పన్నమవుతుందని అభిప్రాయపడుతున్నారు. పార్టీ పరంగా బీసీలకు కేటాయించిన జనరల్ స్థానాలకు సంబంధించి ఆ వర్గంలోనే బహుముఖ పోటీ ఉంటే కొత్త తలనొప్పులు ఎదురవుతాయని అంచనా వేస్తున్నారు. ఇలాంటి అంశాలు గెలుపోటములను ప్రభావితం చేసే అవకాశం ఉండడంతో ఆయా పార్టీల ముఖ్య నాయకుల్లో గుబులు నెలకొన్నట్లు తెలుస్తోంది.
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ముందుగా సం‘గ్రామానికి’ అడుగులు పడ్డాయి. డిసెంబర్లోపు గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు, సుప్రీం కోర్టు సూచనల మేరకు రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా ఎన్నికలకు వెళ్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇచ్చిన హామీ మేరకు బీసీలకు కాంగ్రెస్ పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లతో సీట్లు కేటాయిస్తామని స్పష్టం చేసింది. దీంతో జనరల్/అన్ రిజర్వ్డ్ స్థానాల్లో ఎక్కువ శాతం మేర బీసీలు బరిలో నిలిచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చట్టపరంగా బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని.. పార్టీ పరంగా అయితే పలు గ్రామాలకు సంబంధించి చిక్కులు, చికాకులు తప్పవని సీనియర్ రాజకీయ నేతలు అభిప్రాయపడుతున్నారు.
‘హస్తం’ దారిలోనే
ప్రతిపక్షాలు..
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్కు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అక్టోబర్లో జీఓ 9 జారీ చేసింది. ఆ తర్వాత ఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడి, నామినేషన్ల ఘట్టం ప్రారంభమైంది. ఈ క్రమంలో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ జరగగా.. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన రోజే ప్రక్రియ నిలిచిపోయింది. ఆ సమయంలో బీసీ రిజర్వేషన్లను ఎవరూ వ్యతిరేకిస్తలేరని, తామూ సిద్ధమని.. అయితే చట్టబద్ధత అవసరమని ప్రధాన ప్రతిపక్షాల నేతలు చెప్పారు. ప్రస్తుతం జీపీ ఎన్నికల్లో పార్టీ పరంగా బీసీలకు 42 శాతం సీట్లు కేటాయిస్తామని కాంగ్రెస్ స్పష్టం చేయగా.. బీఆర్ఎస్, బీజేపీ సైతం అదే దారిలో నడిచే అవకాశాలు కన్పిస్తున్నాయి.
గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీసీ వాదమే అందరి ఎజెండాగా నిలిచే అవకాశం ఉంది. ఆటంకాలు ఎదురైనా తాము ఇచ్చిన హామీ మేరకు పార్టీపరంగా బీసీలకు 42 శాతం సీట్లు కేటాయించి సర్పంచ్ ఎన్నికలకు వెళ్తున్నామని.. చట్టబద్ధతపై కోర్టు కేసులు కొలిక్కి వచ్చాకే ప్రాదేశిక, మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై తదుపరి నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది. దీంతో పాటు ప్రజాపాలనలో సంక్షేమ, అభివృద్ధి ఫలాలను స్థానికంగా వివరిస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రణాళికతో ఆ పార్టీ ముందుకు సాగుతున్నట్లు ఆ పార్టీ నేతల మాటలు స్పష్టం చేస్తున్నాయి. ఇదేక్రమంలో బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించకపోవడం.. అమలు కాని కాంగ్రెస్ ఎన్నికల హామీలు.. వివిధ పథకాల అమలులో జాప్యం, లోపాలను ఎత్తిచూపుతూ బీఆర్ఎస్, బీజేపీలు ఎన్నికల కదనరంగంలోకి దూకనున్నట్లు తెలుస్తోంది.
ఎవరికి వారు తమదైన వాదంతో..


