భూ సమస్యలు సత్వరమే పరిష్కరించాలి
గద్వాల: భూభారతి, సాదాబైనామా తదితర భూసమస్యలకు సంబంధించిన దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో కాన్ఫరెన్స్హాలులో రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ సదస్సుల సందర్భంగా 6,391 దరఖాస్తులు వచ్చాయని వీటిలో వివిధ స్థాయిలో పెండింగ్లో ఉన్న ఆయా దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి నిబంధనల మేరకు పరిష్కరించాలన్నారు. జిల్లాలో ప్రభుత్వానికి చెందిన వివిధ భూములు పలుచోట్ల ఆక్రమణలకు గురవుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, వీటిపై దృష్టి పెట్టి అన్యాక్రాంతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా కుల, ఆదాయ నివాస ద్రువీకరణ పత్రాలు, కల్యాణలక్ష్మీ, షాదీముభారక్ తదితర దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించి జిల్లాలో ఇప్పటివరకు 35శాతం మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయిందన్నారు. ఆయా పోలింగ్ స్టేషన్ల వారీగా సూపర్వైజర్లు, బీఎల్వోలు మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలను తహసీల్దార్లు క్రమం తప్పకుండా సందర్శించి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ, ఆర్డీవో అలివేలు, ఆయా మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.


