‘యాసంగి’కి కన్నీళ్లేనా..?
అయోమయంలో ఆర్డీఎస్ రైతులు
● గతేడాది తుంగభద్ర డ్యాం 9వ గేటు కొట్టుకుపోయిన వైనం
● గేట్ల మరమ్మతు పూర్తయ్యేవరకు
పూర్తి స్థాయిలో నీరు నిల్వ చేయలేమని అధికారుల స్పష్టం
● ఈ ఏడాది జనవరి వరకు నీటి విడుదల ప్రశ్నార్థకమే..
● బీళ్లను తలపిస్తున్న ఆయకట్టు పొలాలు
దిక్కుతోచడం లేదు..
ఆర్డీఎస్ డి–25ఏ కింద మాకు 40 ఎకరాల పొలం వుంది. మొక్కజొన్న వేద్దా మని ఆర్డీఎస్ నీటి కోసం ఎదురుచూస్తున్నాం. కానీ, ఈ ఏడాది నీళ్లు వస్తాయో రావోనని భయంగా ఉంది. అధికారులు ఏవిషయం చెబితే బాగుంటుంది. గ్రా మంలో 3వేల ఎకరాల ఆయకట్టు రైతులకు దిక్కుతోచడంలేదు. – కృష్ణారెడ్డి, రైతు, కొంకల
సమావేశం తర్వాతే..
ఈ నెల 21న తుంగభద్ర బోర్డు సమావేశం ఉంది. కర్ణాటక, ఆంధ్రప్రదేష్, తెలంగాణ నీటిపారుదలశాఖ అధికారులు పాల్గొంటారు. గేట్ల పనులు పూర్తికానందున టీబీ డ్యాంలో ఎంత నీరు నిల్వ వుంటుందో అనే అంశంపై మరోసారి చర్చిస్తాం. ఆతర్వాత నీటి విడుదలపై ప్రకటన విడుదల చేస్తాం.
– బి.శ్రీనివాసులు, ఈఈ, నీటిపారుదలశాఖ, జోగుళాంబ గద్వాల జిల్లా
శాంతినగర్: భారీ వర్షాల నేపథ్యంలో వానాకాలం సీజన్ రైతులకు అప్పులే మిగిల్చింది. కనీసం యాసంగి సీజన్ అయినా కలిసొస్తుంది అనుకున్న ఆర్డీఎస్ రైతులకు మరో పిడుగులాంటి వార్త తెలిసింది. తుంగభద్ర డ్యాం (టీబీడ్యాం) గేట్ల మరమ్మతు పూర్తికాకపోవడంతో డ్యాంలో పూర్తి స్థాయి నీటి నిల్వలు 105 టీఎంసీలు నిల్వ చేయలేదని, యాసంగి పంటలకు నీటిని అందించలేమని చెప్పడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు నీటిపారుదలశాఖ అధికారులు ఆర్డీఎస్ కెనాల్కు నీటి విడుదల విషయమై ఇప్పటివరకు ఏ ప్రకటన చేయకపోవడంతో ఆయకట్టు రైతులు అయోమయంలో పడ్డారు. వానాకాలంలో సాగుచేసిన పత్తి, కూరగాయలు, ఆముదం పంటలను రైతులు ముందస్తుగానే తొలగించి యాసంగి పంటలు సాగుచేద్దామని సమాయత్తమయ్యారు. ఇంతలోనే టీబీ డ్యాం అధికారుల ప్రకటనతో చదును చేసిన భూమిలో పంటలు వేయలేక రైతులు కన్నీటిపర్యాంతమవుతున్నారు.
నీటి విడుదలపై సందిగ్ధం
టీబీ డ్యాం వద్ద 33 గేట్లు ఏర్పాటుచేయకపోవడంతో పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేయలేమని, ప్రస్తుతం వున్న 80 టీఎంసీలతో రబీకి నీళ్లు ఇవ్వలేమని వానాకాలం సీజన్కు ముందే ఆంధ్రప్రదేష్ నీటిపారుదలశాఖ అధికారుల బోర్డు ప్రకటించింది. దీంతో అక్కడ యాసంగిలో సాగుచేసే 3.5 లక్షల ఎకరాల్లో సాగు ప్రశ్నార్ధకంగా మారింది. అక్కడి ఆయకట్టు పొలాలకు పూర్తిస్థాయిలో సాగునీరందించాలంటే డ్యాంలో కనీసం 110 టీఎంసీలు వుండాలని ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నారు. 110 టీఎంసీలు నిల్వ చేసేందుకు గేట్లు సహకరించవని దీంతో నీటిని విడుదల చేసే అవకాశం లేదని టీబీ డీఈఈ జ్ఙానేశ్వర్ తేల్చిచెప్పారని సమాచారం. డ్యాంలో 80 టీఎంసీలు వుంటే మిగతా గేట్లు ఏర్పాటుచేయడానికి సాధ్యపడదని 40 టీఎంసీలకు తగ్గిస్తేనే గేట్లు ఏర్పాటుచేస్తామని టెండర్ దక్కించుకున్న గుజరాత్ కంపెనీవారు తేల్చి చెప్పడంతో డ్యాంలో వున్న 80 టీఎంసీల్లో 40 టీఎంసీలు తగ్గించడానికే ఇంజినీర్లు మొగ్గు చూపుతున్నారని సమాచారం. జాప్యం చేస్తే వచ్చే ఖరీఫ్ వానాకాలం పంటలకు నీరందించడానికి ఇబ్బందికరంగా మారుతుందని ఇంజనీర్లు చెబుతున్నారు. ఇదిలాఉండగా, ఈనెల 7న నిర్వహించాల్సిన టీబీ బోర్డు మీటింగ్వాయిదా పడింది. కేంద్ర ఆర్థికశాఖ తరపున సభ్యులుగా వుండే ఉన్నతస్థాయి అధికారి రాకపోవడంతో సమావేశం వాయిదాపడినట్లు నీటిపారుదలశాఖ అధికారులు చెబుతున్నారు. 21కి సమావేశం వాయిదా వేశామని ప్రకటించారు.
కర్ణాటకలోని తుంగభ ద్ర డ్యాం
తాగునీటి కోసం విడుదల
19వ గేటుతో తలెత్తిన సమస్య
గతేడాది వానాకాలం సీజన్ ఆగస్టులో టీబీ డ్యాం వద్ద ఏర్పాటుచేసిన 19వ గేటు వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. డ్యాంలో పూర్తిస్థాయిలో వున్న 105 టీఎంసీల్లో సగానికి పైగా సుమారు 50 టీఎంసీలు సముద్రం పాలయ్యాయి. అయితే, తుంగభద్ర డ్యాం వద్ద 33 క్రస్టు గేట్లలో చాలామటుకు తుప్పుపట్టగా.. ఇప్పటివరకు 12 గేట్లు కొత్తగా ఏర్పాటుచేశారు. మొత్తం రూ.52 కోట్లతో 33 గేట్లు కొత్తగా అమర్చాలని అంచనా వేశారు. ఇప్పటివరకు సగం గేట్లు కూడా కొత్తవి ఏర్పాటుచేయకపోవడంతో పూర్తిస్థాయిలో నీటిని 105 టీఎంసీలు నిల్వ వుంచే పరిస్థితి లేదని టీబీ అధికారులు చెబుతున్నారు. మరో వారం రో జుల్లో 3 గేట్లు పూర్తవుతాయని సామాచారం.
టీబీ డ్యాంలో తెలంగాణ వాటా 9 టీఎంసీలు, ఆంధ్రప్రదేష్ వాటా 14 టీఎంసీలు. 105 టీఎంసీలు పూర్తిస్థాయి నీటి మట్టం వున్న సమయంలో ఆయా రాష్ట్రాల వాటాలు పూర్తిగా విడుదలయ్య అవకాశం వుండేదికాదు. అలాంటిది ప్రస్తుతం నిల్వ వున్న 80 టీఎంసీల్లో గేట్లు ఏర్పాటుకొరకు మరో 40 టీఎంసీలను దిగువకు విడదల చేస్తే మన వాటా కేవలం 2 టీంఎసీలకు పరిమితమయ్యే అవకాశం వుందని అదికారులు చెప్పకనే చెబుతున్నారు. దీంతో వచ్చే 2 టీఎంసీల నీరు తాగునీటి కొరకు వేసవికాలంలో విడుదల చేస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలాఉండగా, ఈనెల 21న జరిగే తుంగభద్ర డ్యాం (టీబీ బోర్డు) సమావేశంలో యాసంగి పంటలకు క్రాప్ హాలీడే ప్రకటించే అవకాశం వున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆయకట్టు రైతులు పంటలు సాగుచేసేందుకు సమాయత్తమవుతున్న తరుణంలో టీబీ బోర్డు సమావేశం అనంతరం పంటలు సాగుచేసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నారు.
‘యాసంగి’కి కన్నీళ్లేనా..?
‘యాసంగి’కి కన్నీళ్లేనా..?


